
గద్వాల, వెలుగు: ప్రభుత్వ భూమితో పాటు తన భూమిని కూడా కబ్జా చేశారని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కేటీ దొడ్డి మండలం రంగాపురం గ్రామానికి చెందిన రైతు ముచ్చు బంగారన్నకు కొంత వ్యవసాయ భూమి ఉంది.
దానికి ఆనుకుని ప్రభుత్వ భూమి ఉండగా.. గ్రామానికి చెందిన కొందరు సర్కార్ భూమిని కబ్జా చేయడంతో పాటు అతని పట్టా భూమిని కూడా ఆక్రమించుకోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో భూమి వద్దనే మంగళవారం బంగారన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం గద్వాల ఆస్పత్రి తరలించారు.
ఇదివరకే తహసీల్దార్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే బంగారన్న ఆత్మహత్యకు యత్నించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.