కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్..

కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్..

హైదరాబాద్ ఇందిరా పార్కులో బీజేపీకి పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం , పోలీసుల తోపులాటలో ఇందిరా పార్క్ వద్ద బిజెపి కార్యకర్తలు, నేతలు గాయపడటంపై కిషన్ రెడ్డిని అడిగి తెల్సుకున్నారు అమిత్ షా.

అంతకుముందు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్  ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. 

బీజేపీ 24 గంటల ఉపవాస దీక్షకు పోలీసులు సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. అయితే సాయంత్రం 6 అయ్యాక దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు కిషన్ రెడ్డిని కోరారు. కానీ కిషణ్ రెడ్డి సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం వరకు  దీక్ష చేస్తామనడంతో పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో  కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి పోలీసులకు, కిషన్ రెడ్డికి మధ్య వాగ్వాదం కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బీజేపీ కార్యకర్తలను పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.