- చిట్ఫండ్ కంపెనీ ఏజెంట్ దంపతుల దాడిలో యువకుడికి తీవ్రగాయాలు
వరంగల్క్రైం, వెలుగు: తనకు రావాల్సిన చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ యువకుడిపై చిట్ఫండ్ కంపెనీ ఏజెంట్, అతని భార్య కలిసి పెట్రోల్పోసి నిప్పంటించారు. హనుమకొండ పోలీస్ స్టేషన్కు అడుగుల దూరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలసముద్రానికి చెందిన పిట్టల రాజు(30) హనుమకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ భవన్ దగ్గర సెల్ ఫోన్షాపు నిర్వహిస్తున్నాడు. వచ్చే ఆదాయంలో ఎంతోకొంత సేవ్ చేసుకునేందుకు నక్కలగుట్ట ప్రాంతంలోని అచల చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏజెంట్ గణేశ్ ద్వారా రూ.5 లక్షల చిట్టీ వేశాడు. జనవరిలో చిట్టీ టర్మ్ కంప్లీట్కాగా తనకు రావాల్సిన డబ్బు కోసం రాజు పలుసార్లు చిట్ఫండ్ కంపెనీకి వెళ్లి అడిగాడు. అక్కడ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చిట్టీ డబ్బులు కట్టించిన ఏజెంట్గణేశ్ను పలుసార్లు నిలదీశాడు. గణేశ్, అతని భార్య కావ్యతో గురువారం గొడవపడ్డాడు. దీంతో గణేశ్ దంపతులు రాజు షాపు తగలబెట్టేందుకు ప్లాన్ వేశారు. గణేశ్, కావ్య దంపతులు శుక్రవారం ఓ బాటిల్లో పెట్రోల్ తీసుకుని రాజు సెల్ ఫోన్ షాపు దగ్గరికి వెళ్లారు. షాపులో ఉన్న వస్తువులతో పాటు పక్కనే ఉన్న రాజు భార్య సిరి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. అక్కడే ఉన్న రాజు సిరిని రక్షించి బయటకు తీసుకురాగా.. కావ్య మరోసారి రాజుపై పెట్రోల్ గుప్పించింది. దీంతో ఆయన ఒళ్లంతా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న పాన్షాపు యజమాని రంగయ్య, ఇతర షాపుల వాళ్లు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో రంగయ్య స్వల్పంగా గాయపడ్డాడు. రాజు, రంగయ్య ఇద్దరినీ పక్కనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది షాపులో మంటలను ఆర్పివేశారు. రాజు భార్య సిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు
హనుమకొండ సీఐ వేణుమాధవ్, ఎస్సై రఘుపతి చెప్పారు.