చిట్టీ డబ్బులు అడిగినందుకు.. పెట్రోల్​ పోసి నిప్పంటించిన్రు

చిట్టీ డబ్బులు అడిగినందుకు.. పెట్రోల్​ పోసి నిప్పంటించిన్రు
  • చిట్​ఫండ్ ​కంపెనీ ఏజెంట్ ​దంపతుల దాడిలో యువకుడికి తీవ్రగాయాలు

వరంగల్​క్రైం, వెలుగు: తనకు రావాల్సిన చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ యువకుడిపై చిట్​ఫండ్ కంపెనీ ఏజెంట్, అతని భార్య కలిసి పెట్రోల్​పోసి నిప్పంటించారు. హనుమకొండ పోలీస్ స్టేషన్​కు అడుగుల దూరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలసముద్రానికి చెందిన పిట్టల రాజు(30) హనుమకొండ పోలీస్​ స్టేషన్​ సమీపంలోని కాంగ్రెస్​ భవన్​ దగ్గర సెల్​ ఫోన్​షాపు నిర్వహిస్తున్నాడు. వచ్చే ఆదాయంలో ఎంతోకొంత సేవ్​ చేసుకునేందుకు నక్కలగుట్ట ప్రాంతంలోని అచల చిట్​ఫండ్స్​ ప్రైవేట్​ లిమిటెడ్ ​కంపెనీలో ఏజెంట్ గణేశ్ ద్వారా రూ.5 లక్షల చిట్టీ వేశాడు. జనవరిలో చిట్టీ టర్మ్​ కంప్లీట్​కాగా తనకు రావాల్సిన డబ్బు కోసం రాజు పలుసార్లు చిట్​ఫండ్ కంపెనీకి వెళ్లి అడిగాడు. అక్కడ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చిట్టీ డబ్బులు కట్టించిన ఏజెంట్​గణేశ్​ను పలుసార్లు నిలదీశాడు. గణేశ్, అతని భార్య కావ్యతో  గురువారం గొడవపడ్డాడు.  దీంతో గణేశ్​ దంపతులు రాజు షాపు తగలబెట్టేందుకు ప్లాన్​ వేశారు. గణేశ్​, కావ్య దంపతులు శుక్రవారం ఓ బాటిల్​లో  పెట్రోల్​ తీసుకుని రాజు సెల్​ ఫోన్​ షాపు దగ్గరికి వెళ్లారు. షాపులో ఉన్న వస్తువులతో పాటు పక్కనే ఉన్న రాజు  భార్య సిరి మీద పెట్రోల్​ పోసి నిప్పంటించారు. అక్కడే ఉన్న రాజు సిరిని రక్షించి బయటకు తీసుకురాగా.. కావ్య మరోసారి రాజుపై పెట్రోల్ ​గుప్పించింది. దీంతో ఆయన ఒళ్లంతా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న పాన్​షాపు యజమాని రంగయ్య, ఇతర షాపుల వాళ్లు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో రంగయ్య స్వల్పంగా గాయపడ్డాడు. రాజు, రంగయ్య ఇద్దరినీ పక్కనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది షాపులో మంటలను ఆర్పివేశారు. రాజు భార్య సిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 
హనుమకొండ సీఐ వేణుమాధవ్, ఎస్సై రఘుపతి  చెప్పారు.