
- రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టు
- బనకచర్లపై ఆర్థిక శాఖ సెక్రటరీతో ఆఫీసర్ల కీలక సమావేశం
- తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం-బనకచర్ల ప్రాజె క్టుపై కేంద్రం ముందు ఏపీ ప్రతిపాదనలు ఉంచింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ నేతృత్వంలో బనకచర్ల ప్రాజెక్టుపై కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలను అధికారులు అందించారు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.
గత నెలలో పీఎంకు వివరించిన సీఎం చంద్రబాబు
గత నెల జరిగిన భేటీల్లోనూ బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను పీఎం మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. దీంతో ప్రాజెక్టు సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు ఏపీ అధికారులు వివరించారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభనష్టాలను తెలియజేశారు.
భవిష్యత్తులో పోలవరం–-బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై కూడా ప్రజెంటేషన్ లో సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. సముద్రంలోకి వృథాగా పోతున్న సుమారు 2 వేల టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టుతో వినియోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాం టి నష్టం లేదని అభిప్రాయపడ్డారు.