ఆయన మృతి నన్ను కలచి వేసింది: ప్రధాని మోడీ

ఆయన మృతి నన్ను కలచి వేసింది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, యూపీ కేబినెట్ మినిస్టర్ చేతన్ చౌహాన్‌ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కరోనా సంబంధిత సమస్యలకు లోనై చేతన్ ఆదివారం మరణించారు. ఇండియా తరఫున చేతన్ చౌహాన్ 40 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఉత్తర్‌‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా ఆయన పని చేశారు. సైనిక్ వెల్ఫేర్, హోం గార్డ్స్, పీఆర్‌‌డీ, సివిల్ సెక్యూరిటీ పోర్ట్‌ఫోలియోలు ఆయన నిర్వహించారు. రెండుసార్లు లోక్‌సభకు ఆయన ఎన్నికయ్యారు. చేతన్ మృతి తనను కలచి వేసిందని ప్రధాని మోడీ అన్నారు.

‘అద్భుతమైన క్రికెటర్‌‌ అయిన చేతన్ చౌహాన్ ఆ తర్వాత శ్రద్ధ కలిగిన రాజకీయ నేతగా మారారు. యూపీలో బీజేపీ బలపడటానికి ఆయన చాలా కృషి చేశారు. ప్రజా సేవకు ఆయన చాలా తోడ్పాటునందించారు. ఆయన మృతి నన్ను కలచి వేస్తోంది. ఆయన కుటుంబం, మద్దతుదారులకు నా సంతాపం తెలుపుతున్నా. ఓం శాంతి’ అని మోడీ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా మృతి చెందిన రెండో యూపీ మంత్రి చేతన్ చౌహాన్‌. ఆయన మృతిపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.