గువాహటి/న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో జమ్మూ కాశ్మీర్కు చెందిన 26 ఏండ్ల హిలాల్ అహ్మద్ అనే వ్యక్తిని అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడు ఆలో టౌన్లో నివసిస్తూ.. పాకిస్తాన్కు ఇక్కడి సమాచారాన్ని అందిస్తున్నాడని గుర్తించారు. అయితే, ఈ ప్రాంతంలో భద్రతా దళాల సమాచారాన్ని సేకరించి పంపినందుకు మొదట నజీర్ అహ్మద్ మాలిక్ అనే వ్యక్తిని నవంబర్ 22న అరెస్టు చేశారు.
అతడు జమ్మూ కాశ్మీర్ కుప్వారాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ తర్వాత రెండో నిందితుడు, కుప్వారా నివాసి అయిన సబీర్ అహ్మద్ మీర్ను అరుణాచల్ రాజధాని ఈటానగర్లో అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ ముగ్గురూ అరుణాచల్ ప్రదేశ్లో మకాం వేయడంతో.. ఈ ప్రాంతంలో దేశ వ్యతిరేక శక్తులను ప్రేరేపించడానికి కుట్ర జరుగుతోందని అనుమానిస్తున్నారు.
