ఎన్సీపీకి మరో షాక్.. జితేంద్ర అవద్ రాజీనామా

ఎన్సీపీకి మరో షాక్.. జితేంద్ర అవద్ రాజీనామా

నేషనలిస్ట్  కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపీ)కి మరో బిగ్ షాక్ తగిలింది.  ఇప్పటికే పార్టీ  అధ్యక్ష పదవికి శరద్ పవార్ మే 2న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి పదవికి జితేంద్ర అవద్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన పదవికి రాజీనామా చేశానని, రిజైనింగ్ లెటర్ ను శరద్ పవార్ కు పంపించానని జితేంద్ర అవద్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

తనతోపాటు పలువురు ఆఫీస్ బేరర్లు కూడా రాజీనామా చేసినట్టు జితేంద్ర అవద్ ట్వీట్ చేశారు. శరద్ పవార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జితేంద్ర అవద్ తెలిపారు.  శరద్ పవార్‌ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని  జితేంద్ర అవద్  ఇప్పటికే కోరారు. ఆయనప్పటికీ   శరద్ పవార్  ఇంకా తన రాజీనామాను ఉపసంహరించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి జితేంద్ర అవద్‌ కూడా రాజీనామా చేశారు. 

మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్ష  పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎన్సీపీ కార్యకర్తలు   నిరసనలు చేపడుతున్నారు.. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని  దేశవ్యాప్తంగా కార్యకర్తలు ఏకీభవించడం లేదు. శరద్ పవార్ తన మనసు మార్చుకుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  డిమాండ్  చేస్తున్నారు. అందులో భాగంగా ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో రోడ్లపై బైఠాయించి ఎన్సీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.