మరో నిరుద్యోగి ఆత్మహత్య

మరో నిరుద్యోగి ఆత్మహత్య
  • ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఉరేసుకున్న రాకేశ్​ యాదవ్​
  • సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం

దుబ్బాక, వెలుగు: మరో నిరుద్యోగి ప్రాణం తీసుకున్నడు. ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాల్టీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో ఆదివారం జరిగిందీ ఘటన. పెంజర్ల భాగ్యలక్ష్మి-, భిక్షపతి దంపతులకు ముగ్గురు కొడుకులు. వీరిలో చిన్న కొడుకు పెంజర్ల రాకేశ్‌ యాదవ్‌ (22) డిగ్రీతోపాటు ల్యాబ్​ టెక్నిషియన్​కోర్సు పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జాబ్‌ కోసం చాలా రోజులు తిరిగాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం సాయంత్రం పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాకేశ్ చనిపోయే ముందు తన చిన్న అన్న నాగరాజుకు ఫోన్ నుంచి లొకేషన్ పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం వద్దకు వెళ్లి చూడగా రాకేశ్ చెట్టుకు వేలాడుతూ కనిపించాడని.. వెంటనే కిందికి దించినా అప్పటికే చనిపోయాడని చెప్పారు. అతడి జేబులో ఒక చిట్టీ దొరికింది. ‘‘నాకు ఉద్యోగం రాలేదు. నాన్న, అన్నలు జాగ్రత్త.. అమ్మ పైలం’’ అని అందులో రాసి ఉంది. రాకేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.