
రైతు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తాడు. చేతికొచ్చాక దాన్ని మార్కెట్ చేసుకోవడానికి కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది. మధ్యవర్తుల దోపిడీ, లాజిస్టిక్స్ సమస్యలు, సరైన ధరల గురించి సమాచారం లేకపోవడం.. ఇలా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. రైతు కుటుంబంలో పుట్టిన అనూమీనా వాటిని చూస్తూ పెరిగింది. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఆగ్రోవేవ్ అనే అగ్రిటెక్ స్టార్టప్ పెట్టింది.
అనూమీనాది రాజస్థాన్లోని మనోలి గ్రామం. తన తాత గోధుమలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు పండించే సాధారణ రైతు. పంటను అమ్ముకోవడానికి అతను పడే ఇబ్బందులను చూస్తూ పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం చాలా కష్టమని చిన్నవయసులోనే అర్థం చేసుకుంది. పగలు, రాత్రి తేడా లేకుండా మండీ (మార్కెట్)కి వెళ్లడం, ధరల కోసం బేరసారాలు చేయడం, మధ్యవర్తులు, వ్యాపారులను రిక్వెస్ట్ చేయడం లాంటివన్నీ చూసి ఆ సమస్యలకు ఎలాగైనా పరిష్కారం కనిపెట్టాలి అనుకుంది. తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో కష్టపడి చదివింది. రోజూ ఐదు కిలోమీటర్లు నడిచి వాళ్ల ఊరికి దగ్గర్లోని టౌన్కి వెళ్లి పదో తరగతి వరకు చదువుకుంది. టెన్త్లో తనే స్కూల్ టాపర్. ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 2016లో ఐఐటీ ఢిల్లీ నుంచి బయోకెమికల్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఆ తర్వాత అనుభవం కోసం కొన్నాళ్లపాటు ఒక అమెరికన్ లాజిస్టిక్ స్టార్టప్లో పనిచేసింది.
సులభంగా..
ఆగ్రోవేవ్ యాప్ రైతులకు సులభంగా ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలు కల్పిస్తుంది. రైతులు యాప్ ద్వారా తమ ఉత్పత్తులను అమ్మాలి అనుకుంటున్న మండీ లేదా కస్టమర్ని ఎంచుకోవచ్చు. పికప్ టైమింగ్ స్లాట్స్ని కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ స్లాట్ టైంలో ఆగ్రోవేవ్ పికప్ వ్యాన్లను రైతు పొలం దగ్గరకు తీసుకెళ్లి, పంటను సేకరిస్తారు. అదే రోజు దాన్ని రైతు సెలక్ట్ చేసుకున్న మండీకి చేరుస్తారు. ప్రస్తుతం వీళ్లు రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్రల్లో ఐదు వేల కంటే ఎక్కువ మంది రైతులకు తమ సర్వీసులు అందిస్తున్నారు. రైతులు, కస్టమర్లు.. ధర, పేమెంట్ మోడ్, ప్రొడక్ట్ క్వాలిటీ లాంటివి కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.
అవార్డులు..
అను మీనా ఆగ్రోవేవ్ ద్వారా చేసిన కృషికి గుర్తింపుగా 2019లో ‘‘గ్లోబల్ గాంధీ అవార్డు’’ అందుకుంది. ఫోర్బ్స్–30 అండర్ 30 ఆసియా లిస్ట్లో కూడా చోటు సంపాదించింది. మరికొన్ని సంవత్సరాల్లో ఎంపీఎస్ నెట్వర్క్ను 40,000 స్టేషన్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది అను మీనా. కంపెనీకి ప్రస్తుతం అను మీనా సీఈవోగా పనిచేస్తోంది. అందులో ఆమె వాటా 39.45 శాతం ఉంది.
రైతులకు ఆదాయం
ఆగ్రోవేవ్ వల్ల రైతుల ఆదాయం 15 నుంచి -20 శాతం పెరిగింది. కస్టమర్లకు కూడా తాజా కూరగాయలు, పండ్లు తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఉదాహరణకు ఒక రైతు సాధారణంగా కిలో ఆలుగడ్డలను మార్కెట్లో 30 రూపాయలకు అమ్మితే.. ఆగ్రోవేవ్లో సుమారు 5 రూపాయలు ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఇక కస్టమర్లు మార్కెట్ ధరకంటే రెండు మూడు రూపాయలు తక్కువ ధరకే కూరగాయలు కొనుక్కోవచ్చు.
మొబైల్ పికప్ స్టేషన్లు
సంవత్సరంపాటు ఉద్యోగం చేసిన మీనా 2017లో గుర్గ్రామ్లో ‘ఆగ్రోవేవ్’ పేరుతో అగ్రిటెక్ స్టార్టప్ ప్రారంభించింది. ఇది ఫార్మ్–టు–మార్కెట్ బిజినెస్ మోడల్తో పనిచేస్తోంది. స్టార్టప్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీనా ఇండియాలో దాదాపు 50 శాతం కంటే ఎక్కువమంది రైతులు ‘మార్కెటింగ్’ సమస్య ఎదుర్కొంటున్నారని తెలుసుకుంది. వ్యవసాయ ఉత్పత్తులకు పట్టణాల్లో ఉండే భారీ డిమాండ్ గురించి రైతులకు పెద్దగా తెలియదు. అందుకే గ్రామాల్లో తక్కువ ధరకు అమ్ముతుంటారు.
ఈ సంస్థ రైతుల నుంచి నేరుగా ప్రొడక్ట్స్ని కొని, వాటిని చిన్న మండీలు, హోటళ్లు, రిటైలర్లు, రెస్టారెంట్లు, క్యాటరర్లు, క్యాంటీన్లు, పీజీలకు సప్లై చేస్తుంది. దీనివల్ల రైతులతోపాటు కస్టమర్లకూ లాభమే. ఆగ్రోవేవ్ రైతుల కోసం ప్రత్యేకంగా మొబైల్ పికప్ స్టేషన్ల(ఎంపీఎస్)ను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ల ద్వారా గ్రామాల్లోని రైతుల నుంచి నేరుగా పంటను సేకరిస్తారు. రైతులు ఆగ్రోవేవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ఎంపీఎస్ టైమింగ్స్ని కూడా తెలుసుకోవచ్చు.