ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇంట్లో పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అంటూ.. అసెంబ్లీలో ప్రకటించారు సీఎం చంద్రబాబు.
దీనికి సంబంధించి విధివిధానాలు తయారు అవుతున్నాయని.. 90 రోజుల్లో విధివిధానాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని.. వాళ్ల చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందన్నారు సీఎం చంద్రబాబు.13 నుంచి 16 ఏళ్ల వయసు వారు వాడకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధిస్తున్నట్లు ఇవాళే ప్రకటించారు.
కర్ణాటకలో 16 ఏళ్ల లోపు
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తున్నట్లు శుక్రవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
►ALSO READ | 16 ఏళ్లలోపు పిల్లలకు నో ఫేస్బుక్, నో ఇన్స్టా.. కర్ణాటక సీఎం సంచలన నిర్ణయం
పిల్లల్లో మొబైల్ వ్యసనం రోజురోజుకూ పెరగటంతో పాటు.. ఆన్లైన్ గేమింగ్కు బానిసవ్వడం, చదువుపై శ్రద్ధ తగ్గడం, శారీరక ఫిట్నెస్ దెబ్బతినడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో బెంగళూరులో జరిగిన వైస్-ఛాన్సలర్ల సదస్సులో ఈ అంశంపై చర్చించిన తర్వాత ప్రస్తుత ప్రకటన వెలువడింది. విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే ఈ నిషేధం ఫైనల్ అయ్యింది.
