కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మినరసింహాస్వామి రథాన్ని ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం అమరావతి నుండి నేరుగా అంతర్వేదికి చేరుకున్న సీఎం జగన్.. శ్రీలక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని జగన్ లాగి ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి అంతర్వేది ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు మాసాల్లోనే కొత్త రథాన్ని తయారు చేయించింది. ఏడు అంతస్థులతో 40 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో రూ.1.10 కోట్లతో ఈ రథాన్ని నిర్మించారు