కరోనా మరణాల నియంత్రణపై దృష్టి: 90 వేల రెమ్‌డెసివర్‌ డ్రగ్స్‌కు ఏపీ సర్కారు ఆర్డర్

కరోనా మరణాల నియంత్రణపై దృష్టి: 90 వేల రెమ్‌డెసివర్‌ డ్రగ్స్‌కు ఏపీ సర్కారు ఆర్డర్

కొద్ది రోజులుగా ఏపీలో కరోనా మరణాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ప్రతి రోజూ 40 నుంచి 50 మందికి పైగా ఈ మహమ్మారికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో మరణాల రేటును తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ సర్కారు దృష్టి పెట్టింది. వైరస్‌ బారినపడి ఆరోగ్యం విషమించిన పేషెంట్లకు ఉపయోగించే రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్‌ లాంటి యాంటీవైరల్‌ డ్రగ్స్‌ను పెద్ద మొత్తంలో ఆస్పత్రులకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో తయారు చేస్తున్న రెమ్‌డెసివర్‌ డ్రగ్స్‌ను 90 వేల డోసులు కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే 5 వేల డోసులను కంపెనీ అందించగా.. రేపు సాయంత్రానికి మరో 15 వేల డోసులు రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రులకు చేరనున్నాయని తెలుస్తోంది. ఆగస్టు మూడోవారం నాటికి మరో 70వేలకు డోసులు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే దాదాపు 90వేలకుపైగా రెమ్‌డెసివర్‌ డోసులను ప్రభుత్వం సిద్ధంచేసింది.

విషమ పరిస్థితుల్లో ఉన్న 15వేల మందికి ఈ మందులు సరిపోతాయని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇంత పెద్దమొత్తంలో ఏ రాష్ట్రానికీ ఇంజక్షన్లు లేవని అధికారులు తెలిపారు. గణాంకాల ప్రకారం చూస్తే  క్రిటికల్‌కేర్‌ చికిత్స అవసరమైన రోగుల సంఖ్య పాజిటివ్‌ కేసుల్లో 7 నుంచి 8 శాతం మాత్రమే ఉంటోంది. అంటే దాదాపు 2లక్షల పాజిటివ్‌ కేసుల వరకూ ప్రభుత్వం తెప్పించుకుంటున్న ఇంజెక్షన్లు సరిపోతాయి. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భయం వద్దని సీఎం ఇవ్వాళ్టి సమీక్షా సమావేశంలో స్పష్టం చేశారు. పరిస్థితిని బట్టి ఒక్కో రోగికి  5 నుంచి 7 డోసులు వరకూ రెమ్‌డెసివర్‌ను వినియోగించాల్సి వస్తుంది. ఇలా ఒకొక్కరిపైనా దాదాపు రూ.35 వేల రూపాయల వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఖర్చు ఎంతైనా సరే… ఈ అత్యవసర డ్రగ్స్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోనే హెటిరో ఫార్మా కంపెనీ రెమ్‌డెసివర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఈ మందును అందించాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది.