
అమరావతి, వెలుగు: ఏపీలో 2 వేల జనాభాకు సేవలు అందించేలా విలేజ్ క్లినిక్ను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గ్రామ సెక్రటేరియట్లలో ప్రత్యేకంగా విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవసరమైన ప్రాథమిక వైద్యం, ఆరోగ్య రికార్డుల నిర్వహణను విలేజ్ క్లినిక్లకు అప్పగించాలని సూచించారు. పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులకు విలేజ్ క్లినిక్లు రెఫరల్ సెంటర్లుగా పనిచేస్తాయన్నారు. గురువారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ర్టంలో కొత్తగా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాటిలో 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విలేజ్ క్లినిక్స్ గ్రామాల్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ తరహాలో పనిచేస్తాయన్నారు. పేదలకు ఏదైనా జబ్బు చేస్తే రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందిస్తామని చెప్పారు. చిన్న సమస్యలకు అక్కడికక్కడే చికిత్సలు, మందులు ఇవ్వడం, పెద్ద సమస్యలకు రెఫరల్ పాయింట్గా పనిచేసేలా వీటిని తీర్చిదిద్దాలని ఏపీ హెల్త్ మినిష్టర్ ఆళ్ల నానికి సీఎం జగన్ సూచించారు. 25 లోక్సభ నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద 1 నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు ఫ్రీ డెంటల్ ట్రీట్మెంట్ అందిస్తామన్నారు.
For More News..
యూత్కు ఉపాధి కోసం ‘కేసీఆర్ ఆపద్బంధు’