
- ఆయా కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ
- రూ.వెయ్యి కోట్లతో మిడ్మానేరులో యూనిట్ పెడతామన్న ఫిష్ఇన్
- హైదరాబాద్లో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటుకు కాన్ఫ్లుయెంట్ ఓకే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చేపల హేచరీల సంస్థ ఫిష్ఇన్, మెడికల్ పరికరాల తయారీ సంస్థ కాన్ఫ్లుయెంట్లు ముందుకొచ్చాయి. ఫిష్ఇన్, కాన్ఫ్లుయెంట్, అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీల ప్రతినిధులతో గురువారం మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడ్తామని ఫిష్ఇన్ ప్రకటించింది. చేపల హేచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్, ఎగుమతులపై తమ కంపెనీ పనిచేస్తుందని, రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు రిజర్వాయర్ వద్ద తమ యూనిట్ను ఏర్పాటు చేస్తామని సంస్థ సీఈవో మనీశ్ తెలిపారు. యూనిట్ పూర్తయిన తర్వాత ఏటా 85 వేల టన్నుల చేపలను ఎగుమతి చేస్తామని చెప్పారు. కాగా, ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి ఉపాధి దొరుకుతుందని కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా తమ రాష్ట్రంలోని యువత, మిడ్మానేరు నిర్వాసితులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని సీఈవోను ఆయన కోరారు. హైదరాబాద్లో మెడికల్ పరికరాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని కాన్ఫ్లుయెంట్ప్రెసిడెంట్, సీఈవో డీఆన్ షావర్ తెలిపారు. పైలట్ప్రాజెక్టుగా ఒక ప్రొడక్షన్ యూనిట్ను ఏర్పాటు చేస్తామని, తర్వాత విస్తరిస్తామని చెప్పారు. అందుకు ప్రభుత్వ పరంగా అన్నిరకాలుగా సహకారం అందిస్తామని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్.. లైఫ్సైన్సెస్ హబ్
లైఫ్ సైన్సెస్కు హైదరాబాద్ హబ్ అని కేటీఆర్ అన్నారు. ఫార్మా, లైఫ్సైన్సెస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో రీసెర్చ్ డెవలప్మెంట్, డిజిటల్, టెక్సెంటర్ల ఏర్పాటు, ప్రొడక్షన్ ఇతర కార్యకలాపాలు చేపట్టేందుకు అనేక అవకాశాలున్నాయన్నారు. జీనోమ్వ్యాలీ, మెడికల్ డివైజెస్ పార్క్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఫార్మాసిటీని ప్రారంభిస్తామని చెప్పారు.