ఆర్మీలో నయా చేంజ్: హెడ్ క్వార్టర్స్ ఆఫీసర్లకు బోర్డర్ లో డ్యూటీలు

ఆర్మీలో నయా చేంజ్: హెడ్ క్వార్టర్స్ ఆఫీసర్లకు బోర్డర్ లో డ్యూటీలు

ఆర్మీలో ఇంకో కొత్త పదవి రాబోతోంది. హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్న చాలా మంది అధికారులకు బోర్డర్ లో డ్యూటీలు పడనున్నాయి. అందుకు సంబంధించి తొలి విడత ఆర్మీ సంస్కరణలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించినట్టు సమాచారం. సంస్కరణల్లో భాగంగా మిలటరీ ఆపరేషన్లు, వ్యూహ ప్రణాళికలకు డిప్యూటీ చీఫ్ పదవిని కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం డీజీ (మిలటరీ ఆపరేషన్స్ ), డీజీ (మిలటరీ ఇంటెలిజెన్స్ )లే ఆర్మీచీఫ్ కు రిపోర్టు చేస్తున్నారు. అంతేగాకుండా, విజిలెన్స్ , మానవ హక్కుల సమస్యలకు సంబంధించి మరో కొత్త విభాగాన్నీ ఏర్పాటు చేయబోతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. 12 స్వతంత్ర అధ్యయనాలను పరిశీలించిన తర్వాతే ఆ సంస్కరణలకు రక్షణ మంత్రి లైన్ క్లియర్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సంస్కరణల వల్ల 13 లక్షల మంది సైనికులకు లబ్ధి చేకూరడమే గాకుండా, దేశ యుద్ధ సామర్థ్యమూ పెరుగుతుందని అంటున్నారు.

ఢిల్లీలోని హెడక్వార్టర్స్ లో ఉంటున్న అధికారుల్లో 20 శాతం మందిని పాక్ , చైనా సరిహద్దులకు ట్రాన్స్ ఫర్ చేసినట్టు చెప్పారు. డీసీవోఏఎస్, మాస్టర్ జనరల్ ఆర్డ్​నెన్స్ (ఎంజీవో)లను కలిపేసి డీసీవోఏఎస్ కేపబిలిటీ డెవలప్ మెంట్ అండ్ సస్టెనెన్స్ గా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. విజిలెన్స్ , మానవహక్కుల విభాగాలను మేజర్ జనరల్ ర్యాంకున్న అధికారులు పర్యవేక్షిస్తారు. విజిలెన్స్ డిపార్ట్​మెంట్ ఏడీజీ.. చీఫ్ ఆఫ్ ఆర్మీస్టాఫ్ కింద పనిచేస్తారు. వీసీవోఏఎస్ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ ఏడీజీ పనిచేస్తారు. గత ఏడాది అక్టోబరులో సంస్కరణలకు ఆర్మీ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. ఆర్మీ అధికారుల కేడర్ల పునర్ నిర్మాణం, కీలక కమాండ్లలో అధికారుల వయసు తగ్గింపు, పెరుగుతున్న ఖర్చుల తగ్గింపు, బలగాల పెంపు వంటి సంస్కరణలు అందులో ఉన్నాయి. ఈ సంస్కరణలను త్వరితగతిన అమలు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నట్టు అధికారులు చెప్పారు. ఈ సంస్కరణలకు సంబంధించి ఆర్మీ నాలుగు స్టడీలు చేసింది. బలగాల పునర్వ్యవస్థీకరణపై మొదటి స్టడీ చేశారు. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పునర్వ్యవస్థీకరణపై రెండో స్టడీ, ఆఫీసర్ల కేడర్ రివ్యూపై మూడో స్టడీ, అధికారుల ర్యాంకు నియమాలపై నాలుగో స్టడీచేశారు.