ప్రస్తుతం దేశంలో రెండే హాట్ టాపిక్లు. ఒకటి ఆర్టికల్ 370 రద్దు, రెండోది చంద్రయాన్ 2 ప్రయోగం. రెండోదాని గురించి కాసేపు పక్కనపెడదాం. ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడుకుందాం. దాన్ని రద్దు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే, ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని కొంచెం కొత్తగా ఆలోచించాడు. దాని పేరు మీదే ఓ స్పెషల్ థాలిని కస్టమర్లకు పరిచయం చేశాడు. అదే ఆర్టికల్ 370 థాలి. ఆర్డర్ 2.1 అనే రెస్టారెంట్ ఈ స్పెషల్థాలిని తయారు చేస్తోంది. దానికే యునైటెడ్ ఇండియా థాలి అన్న ఇంకో పేరు కూడా ఉంది. కాశ్మీర్ ఎప్పుడూ ఇండియాలో భాగమేనని, కాబట్టి అందుకు తగ్గట్టు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ ఆర్టికల్ 370 థాలిని ప్రవేశపెట్టిందన్నమాట రెస్టారెంట్. మరి, అంత స్పెషల్ థాలి తినాలంటే పైసలు కూడా బాగానే వదిలించుకోవాలి. అవును మరి, వెజ్ తాలి అయితే ₹2,370, మాంసంతో కావాలంటే 2,669 రూపాయలను పర్సుల నుంచి తీయాల్సిందే. జమ్మూకాశ్మీరోళ్లకైతే డిస్కౌంట్ కూడా ఉంది. ఆ రాష్ట్రానికి చెందినోళ్లు వాళ్ల ఐడీ కార్డులను చూపిస్తే ₹370 తగ్గిస్తారు. తాలి ఎంఆర్పీలో ₹170ను కాశ్మీర్ రిలీఫ్ ఫండ్కు పంపిస్తారట. వెజ్ థాలిలో కాశ్మీరీ పులావ్, కాశ్మీరీ కి రోటీ, ఖుమానీ కి రోటీ, నద్రు కి షమీ, దమ్ ఆలూ, కవాను వడ్డిస్తారు. మాంసం థాలిలో వెజ్ థాలిలో పెట్టే వాటితో పాటు అదనంగా రోగన్ జోష్ పెడతారట. ఆ రెస్టారెంట్ ఇలా కాన్సెప్ట్ థాలిలను పెట్టడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు మోడీ జీ 56 ఇంచ్ థాలి, బాహుబలి పిచర్ వంటి స్పెషల్ ఫుడ్డును కస్టమర్లకు రుచి చూపించింది.