‘నీకు ఇవన్నీ అవసరమా.. నీ వల్ల కాదు. వదిలెయ్. తాహతుకు మించిన పని చేయడం ఎందుకు? ఉన్న పనే చేసుకోవచ్చుగా’ అన్న వాళ్ల నోళ్లు మూయించాడు. యూట్యూబర్ స్థాయి నుంచి దేశంలోనే పేరు పొందిన మోటివేషనల్ స్పీకర్గా, టీచర్గా, స్టూడెంట్స్కు గైడ్గా, కంపెనీ సీఈఒగా, మిలియనీర్గా ఎదిగాడు ముప్ఫైమూడేండ్ల అరవింద్ అరోరా.
రాజస్తాన్లోని జైపూర్లో పుట్టాడు అరవింద్. కంటెంట్ క్రియేటర్గా 2012లో ‘ఎ2 కెమిస్ట్రీ’ అని యూట్యూబ్ ఛానెల్ పెట్టి కేవలం తొమ్మిది నెలల్లోనే ఒక మిలియన్ సబ్స్ర్కైబర్స్ని సంపాదించాడు. ఇప్పుడు 13.7 మిలియన్ సబ్స్ర్కైబర్స్తో దేశంలోని నెంబర్ వన్ ఎడ్యుకేషన్ ఛానెల్స్లో ఒకటిగా ఎదిగింది అరవింద్ ఛానెల్. ఈ సక్సెస్ అంత సులభంగా ఏం రాలేదు. దీనికి ముందు అతన్ని వెనక్కు లాగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుకున్నాడు. వాటిని తట్టుకుని ఈ స్థాయికి ఎదిగాడు.
నీవల్ల కాదన్నారు
జైపూర్లో వీళ్లకు చిన్న కిరాణా దుకాణం ఉండేది. మధ్య తరగతి కుటుంబం కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించలేదు తండ్రి. అక్కడి గవర్నమెంట్ స్కూల్లో హిందీ మీడియంలో చదివాడు అరవింద్. ఇంగ్లీష్ రాకున్నా పట్టుబట్టి బీటెక్లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాడు. చిన్నప్పటి నుండే చుట్టాలంతా ‘ఇంకేంటి.. మీ వాడు కష్టపడాల్సిన పనే లేదు. ఉన్న కిరాణా షాప్ చూసుకుంటే సరిపోతుందిలే’ అనేవాళ్లు. ‘బీటెక్ చదవడం అవసరమా? దానివల్ల ఏం లాభం ఉంటుంది. కెరీర్లో గ్రోత్ ఉండదు. ‘ఆ ఫీజులు కట్టే స్థోమత కూడా నాకు లేదు. వేరే ఏదన్నా కోర్స్ చదువు’ అని తండ్రి అనేవాడు. ‘నాకు ఎవ్వరి హెల్ప్ అక్కర్లేదు. నేనే ఎలాగోలా ఫీజు కట్టుకొని చదువుకుంటా’ అని ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని జైపూర్ ఎస్కెఐటి (స్వామీ కేశవానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్సాలజీ)లో చేరాడు. పెద్ద కాలేజ్, రకరకాల మనుషులు... అక్కడ అంతా కొత్తగా అనిపించింది. మొదటి సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్లు ఫెయిల్ అయ్యాడు. దాంతో అందరి దగ్గరి నుంచి సూటిపోటి మాటలు వినాల్సి వచ్చింది. ‘కష్టపడి చదివి, వీళ్ల నోళ్లు మూయించాలి’ అనుకున్నాడు. తరువాత పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ డబ్బుతో తన అవసరాలు తీర్చుకునేవాడు. ఆ పట్టుదలే బీ టెక్లో సిల్వర్ మెడల్ వచ్చేలా చేసింది. ‘పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు’ అనే నిజం మాట చేసి చూపించాడు.
పోస్టర్లు అంటించి...
కొన్ని రోజులు ఖాళీగా ఉన్న తరువాత తన ఫ్రెండ్తో కలిసి సొంతంగా ‘గేట్’ కోచింగ్ సెంటర్ మొదలుపెట్టాడు. దాని కోసం అన్ని కాలేజీలు తిరుగుతూ పోస్టర్లు అంటించేవాడు. పగలు రాత్రి రెండు పూటలా క్లాస్లు చెప్పేవాడు. తనకున్న టాలెంట్తో రెండు నెలల్లోనే 200 మందికి పైగా స్టూడెంట్లని సంపాదించాడు. కొన్ని రోజులకు ఫ్రెండ్తో గొడవ అయింది. దాంతో ‘ఇనిస్టిట్యూట్ వదిలి వెళ్లిపో’ అన్నాడు ఆ ఫ్రెండ్. అక్కడినుంచి బయటికి వచ్చి చిల్లి గవ్వలేకుండా గుజరాత్ చేరుకున్నాడు. ‘దేవుడు ఒకటి ఇవ్వాలనుకుంటే, ఇంకొకటి దూరం చేస్తాడు’ అనుకున్నాడు. ఓపికగా ఉన్నాడు. ఆరు నెలలు ప్రశాంతత కోసం అందరికీ దూరంగా ఉండి యోగా క్లాస్లకు వెళ్లాడు.
యూట్యూబర్ నుంచి సీఈఓ దాకా
కొన్ని రోజులకు ‘మేడ్ ఈజీ కెమిస్ట్రీ’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ను మొదలుపెట్టాడు. దాంతో జేఈఈ, నీట్ క్లాస్లు చెప్పేవాడు. అది ఎంట్రన్స్ టెస్ట్ల సీజన్ కావడంతో ఆ ఛానెల్కు మంచి ఆదరణ వచ్చింది. కొద్దిరోజులకు ఆ ఛానెల్నే ‘ఎ2 కెమిస్ట్రీ’గా మార్చాడు. తరువాత ‘ఎ2 మోటివేషన్’ అని మోటివేషన్ క్లాస్ల యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు. ఇది ఇప్పుడు 13.7 మిలియన్ సబ్స్ర్కైబర్స్ను దాటింది. కొన్ని రోజులకు ఎ2 కెమిస్ట్రీ ఛానెల్ను ‘వేదాంతు ఇన్నొవేషన్స్’లో కలిపేసాడు. ఇది ఇప్పుడు 1.45 మిలియన్ సబ్స్ర్కైబర్స్ను దాటి దేశంలోనే నెంబర్ వన్ నీట్ యూట్యూబ్ ఛానెల్గా ఎదిగింది. ఎ2 మోటివేషన్తో కలిపి ఇప్పుడు మొత్తం 12 యూట్యూబ్ ఛానెల్స్ను నడిపిస్తున్నాడు. అంతేకాదు స్టూడెంట్స్కు మోటివేషన్ స్పీచ్లు ఇప్పించేందుకు చాలామంది టీచర్స్ అరవింద్ దగ్గరికి వెళ్తున్నారు. దాంతో కాలేజీల్లో గెస్ట్గా వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్తున్నాడు. ఇతని ద్వారా ఇప్పటి వరకు రెండున్నర కోట్లమంది పైగా విద్యార్థులు లాభపడ్డారు. ఇప్పుడు ‘కాంక్వర్ వరల్డ్. ఫస్ట్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ యాప్’ తయారుచేశాడు. దీనికి అరవింద్ సీఈఒ. యూట్యూబ్, మోటివేషనల్ క్లాస్లు, ప్రైవేట్ క్లాస్ల నుంచి నెలకు1.7 కోట్లు సంపాదిస్తున్నాడు అరవింద్. ఇప్పుడు తన నెట్వర్త్ వచ్చి 9.5 మిలియన్ అంటే 71 కోట్లు.
అవార్డులు
యూట్యూబ్ క్రియేటర్గా ఒక డైమండ్ ప్లే బటన్, మూడు గోల్డెన్ ప్లే బటన్స్, 10 సిల్వర్ ప్లే బటన్స్ అందుకున్నాడు. వేదాంతు వాళ్ల టి– కాన్ బెంగళూరు నుంచి యూట్యూబ్ స్టార్ 2019, వెల్క్రో అవార్డ్స్ గెలుచుకున్నాడు. అన్ అకాడమీ నుంచి ఎడ్యుకేటర్ అవార్డ్, ఇంకా రకరకాల సన్మానాలు, యాభైకి పైగా షీల్డ్లు గెలుచుకున్నాడు.