హైదరాబాద్, వెలుగు: ‘మిస్టర్ మోడీ.. ఇండియాలో హిందూ, ముస్లింల మధ్య సమస్య ఉందా?’ అని ప్రధానిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇండియా, పాకిస్థాన్ ప్రధానులతో ఫోన్లో మాట్లాడారు. కాశ్మీర్ అంశం క్లిష్టమైనదని, అక్కడి హిందూ, ముస్లింల మధ్య సంబంధాలు అంత బాగా లేవన్నారు. పరిస్థితులు చేజారకముందే పరిష్కారం కనుగొంటే మంచిదని సూచించారు. కాశ్మీర్లో శాంతి నెలకొనేందుకు తాను సహకరిస్తానన్నారు. మరి ట్రంప్ అన్నట్టు దేశంలో హిందూ, ముస్లింల మధ్య మతపర సమస్య ఉందని ప్రధాని అంగీకరిస్తున్నారా?’ అని ప్రశ్నించారు.

