- అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు
- ఇయ్యాల తీరం దాటే అవకాశం ఉందన్న ఐఎండీ
పోర్ట్బ్లెయిర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపింది. అక్కడి తీర ప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సైక్లోన్కు శ్రీలంక ‘అసాని’అని పేరు పెట్టింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది సోమవారం సాయంత్రం నాటికి తీవ్రంగా మారే అవకాశం ఉందని ఐఎండీ ట్వీట్ చేసింది. మార్చి 22(మంగళవారం) నాటికి ఇది బలహీనపడి తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ అసని తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ తీరం వైపు కదులుతోందని పేర్కొంది. ఈ క్రమంలో చెన్నై, విశాఖపట్నంలోని మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే అండమాన్ నికోబార్లోని పలు ప్రాంతాల్లో 150 మంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని పంపించామని, ఆరు రిలీఫ్ క్యాంప్లను తెరిచినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్చి 22 వరకు ఇంటర్ ఐలాండ్ షిప్పింగ్ సర్వీసులను రద్దు చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ షిప్పింగ్ సర్వీసెస్ ఆదేశించింది.