బ్రిస్బేన్: వరల్డ్ నంబర్ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల వయసులోనే ఆటకు గుడ్బై చెప్పింది. ఈ మేరకు బుధవారం ఇన్స్టాగ్రామ్లో తన రిటైర్మెంట్కు సంబంధించిన ఆరు నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి రెండు నెలలు కూడా కాకముందే.. బార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం టెన్నిస్ వరల్డ్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తన స్వంత ప్రయోజనాల కోసమే ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె వెల్లడిం చింది. ‘ఈ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నా మనసు చెబుతున్నది. వేరే కలలను నెరవేర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది’ అని బార్టీ చెప్పింది. 2010లో ప్రో టెన్నిస్ ప్లేయర్గా మారిన ఆమె 2011లో 15 ఏళ్ల వయసులోనే జూనియర్ వింబుల్డన్ను గెలిచింది. 12 ఏళ్ల తన కెరీర్లో యాష్లే మూడు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ (2019 ఫ్రెంచ్, 2020 వింబుల్డన్, 2022 ఆస్ట్రేలియన్)ను సాధించింది. సింగిల్స్లో 15 టూర్ లెవెల్ టైటిల్స్,12 డబుల్స్ టైటిల్స్ను గెలిచింది. గత రెండేళ్ల నుంచి ఆమె నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నది. అయితే బార్టీ టెన్నిస్కు దూరం కావడం ఇదే తొలిసారి కాదు. బిజీ షెడ్యూల్, ఒత్తిడి కారణంగా టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2014, 2015లో ప్రొఫెషనల్ క్రికెటర్గా మారి విమెన్స్ బిగ్బాష్ లీగ్లో పోటీ పడ్డది. 2016లో తిరిగి టెన్నిస్లోకి వచ్చిన బార్టీకి గోల్ఫ్లోనూ మంచి నైపుణ్యం ఉంది.