
- ఏఐ టెక్నాలజీతో విద్యాబోధన
- గర్భిణుల కోసం ప్రతి హాస్పటల్ లో బర్త్ వెయిటింగ్ సెంటర్
- పోడు సాగులో సంయమనంతో ముందుకెళ్తాం
- సీజనల్వ్యాధులు ప్రబలకుండా చర్యలు
- విత్తనాలు, ఎరువులు ఎమ్మార్పీకే అమ్మాలి
- ‘వెలుగు’తో ఇంటర్వ్యూలో ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు : వెనుకబడిన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను విద్య పరంగా ముందు వరుసలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్కు సర్కార్ బడులే కేంద్రాలుగా మారేలా కృషి చేస్తున్నామని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో కలెక్టర్‘వెలుగు’తో మాట్లాడారు.
జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యచరణ, ప్రజలకు మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. పోడు భూముల విషయంలో నాన్ ట్రైబల్ రైతులకు ఇబ్బందులు రాకుండా సామరస్యంగా సమస్యను పరిష్కారించేందుకు ఫారెస్ట్ అధికారులతో కోఆర్డినేషన్ చేస్తున్నామన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
సర్కార్ బడుల్లో నాణ్యమైన బోధన అందిస్తాం
జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు పోతున్నం. తల్లిదండ్రులు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకే పంపాలి. స్కూళ్ల రీ ఓపెన్ నుంచే విద్యార్థులకు యూనిఫామ్ లు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్ అందిస్తున్నాం. విద్యార్థుల నమోదు పెంచేందుకు బడిబాట కార్యక్రమం సక్సెస్ ఫుల్గా నిర్వహిస్తున్నాం. స్కూళ్లు, రెసిడెన్షియల్స్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాం. ఏఐ టెక్నాలజీతో విద్యాబోధన చేస్తాం. ప్రతి స్కూల్ లో ఇంగ్లీష్ బోధన ఉంటుంది. టీచర్ల కొరత ఉన్న చోట సర్దుబాటు చేస్తున్నాం.
నకిలీ బెడద, కొరత లేకుండా పకడ్బందీ చర్యలు
వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే ఆసిఫాబాద్జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నాం. టాస్క్ఫోర్స్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో తనిఖీలు చేస్తున్నాం. రైతులు కొనే ప్రతి దానికీ బిల్లు ఇవ్వాలని ఓనర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మితే లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులకు సరిపడా అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో యాసంగి వడ్ల కొనుగోళ్లు గతేడాది కన్నా ఎక్కువ చేపట్టాం. రైతులకు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకోరావాలి. జిల్లాలో పోడు భూముల సమస్యను నిశితంగా పరిశీలిస్తున్నాం. రైతులను ఒప్పించి ముందుకువెళ్లాలని అధికారుకులకు సూచించాం. చట్టం ప్రకారం నడుచుకోవాలని రైతులను కోరుతున్నాం.
నెల రోజుల ముందే గర్భిణుల తరలింపు
జిల్లాలో వానాకాలం సీజన్లో రోడ్డు, బ్రిడ్జిలు, రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడే 151 గ్రామాలను గుర్తించాం. ఈ గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా మూడు నెలల రేషన్ పంపిణీ చేస్తున్నాం. సమస్యాత్మక గ్రామాల్లోని గర్భిణులకు డెలివరీ సమయంలో ఇబ్బంది రాకుండా నెల రోజుల ముందుగానే ఆయా హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన బర్త్ వెయిటింగ్ రూమ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు కాకుండా వైద్యారోగ్య శాఖను అలర్ట్ చేశాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా శానిటేషన్ చేపడుతున్నాం. హాస్పిటల్స్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వానాకాలంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.