ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు కార్మిక సంఘం నేత అశ్వత్థామ రెడ్డి . ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సెషన్స్ ను పొడిగించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉద్యోగ భద్రత, జీతభత్యాలు ముఖ్యమన్నారు. గవర్నర్ అన్ని ఆర్టీసీ సంఘాలను చర్చలకు పిలిచారని చెప్పారు. కార్మికుల భవిష్యత్ కోసమే తన ప్రయత్నాలని గవర్నర్ అన్నారన్నారు. రాజ్ భవన్ ముట్టడిని ప్రభుత్వం చేయించిందని..లేకపోతే ఆర్టీసీ కార్మికులను ఏనాడైనా బస్సుల్లో తరలించారా అని ప్రశ్నించారు అశ్వత్థామ రెడ్డి .
గవర్నర్ సానుకూలంగా స్పందించారు: థామస్ రెడ్డి
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు కార్మికసంఘాల నేత థామస్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు. అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి వివరణ అందలేదని .. వివరణ అందాక గవర్నర్ ఆమోదిస్తారని చెప్పారు. సత్వర పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ చెప్పినట్లు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులను న్యాయం జరగాలని గవర్నర్ అన్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్న నమ్మకం ఉందన్నారు.