13వేల 500 అడుగుల ఎత్తు నుంచి దూకిన 104ఏళ్ల బామ్మ మృతి

13వేల 500 అడుగుల ఎత్తు నుంచి దూకిన 104ఏళ్ల బామ్మ మృతి

104 ఏళ్ల వయసులో స్కైడైవ్​ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన చికాగోకు చెందిన వృద్ధురాలు డొరొథీ హోఫ్‌నర్‌ ఇక లేరు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆమె మరణించినట్లు హోఫ్​నర్​ స్నేహితుడు కానెంట్​ తెలిపారు. ఆమె మరణంపై స్కైడైవ్​ చికాగో, అమెరికా పారాషూట్​ అసోషియేషన్​లు సంతాపం తెలిపాయి. ఆమె స్మారక సభను నవంబర్​లో నిర్వహిస్తామని వెల్లడించాయి. డొరొథీ హోఫ్‌నర్‌ ఈ రికార్డు సృష్టించిన కొద్ది రోజులకే మృతిచెందారు. 

డొరొథీది చికాగోలోని ఓ పేద కుటుంబం. పసి వయసు నుంచే ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంటూ వచ్చిన ఆమె.. చదువుకోవాలని ఆసక్తి ఉన్నా దాన్ని మధ్యలోనే ఆపేశారు. కుటుంబానికి ఆసరాగా ఉండాలని స్కూలింగ్‌ పూర్తయ్యాక ఓ టెలిఫోన్‌ సంస్థలో ఉద్యోగంలో చేరారు. తనకు ఉన్నంతలోనే స్వేచ్ఛగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న ఆమె.. పెళ్లి కూడా చేసుకోలేదు.

ఇటీవల డొరొథీ హోఫ్‌నర్‌ అక్టోబర్​ 1వ తేదీన 13 వేల 500 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి స్కైడైవ్‌ చేసి..  ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే ఇంతటి సాహసం చేసిన అత్యధిక వయస్కురాలిగా నిలిచారు. 

ఇల్లినాయిస్​ ఒట్టావాలోని స్కైడైవ్‌ చికాగో అనే స్కైడైవింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సాహసాన్ని పూర్తి చేశారు. సుమారు ఏడు నిమిషాల పాటు గాల్లో తేలియాడుతూ నగర సౌందర్యాన్ని ఆస్వాదించారు. ఆపై ఇన్‌స్ట్రక్టర్‌ ప్యారాషూట్‌ ఓపెన్‌ చేయడం వల్ల సురక్షితంగా భూమి పైకి దిగారు. దీనిపై హోఫ్​నర్​ను అడగగా.. వయసు సంఖ్య మాత్రమే.. ఇలాంటి సాహసాలు చేయడానికి వయసుతో పనిలేదని చెప్పుకొచ్చారు బామ్మ.

అంతకుముందు ఈ రికార్డు 103 ఏళ్ల స్వీడిష్‌ బామ్మ లిన్నియా లార్సన్‌ పేరిట ఉంది. తాజాగా డొరొథీ ఈ రికార్డును బద్దలుకొట్టి చరిత్రను తిరగరాశారు. హోఫ్​నర్​.. రికార్డులు, ప్రచారం కోసం స్కైడైవ్ చేయలేదని.. కేవలం ఇష్టంతోనే అలా చేశారని చెప్పారు ఆమె స్నేహితుడు కానెంట్​. తన వందేళ్ల వయసులోనే స్కైడైవింగ్‌ చేయాలని అనుకున్నారు డొరొథీ. కానీ ఆ సమయంలో కుదరకపోవడం వల్ల.. నాలుగేళ్లు తర్వాత తాజాగా 13 వేల 500 ఎత్తు నుంచి దూకారు బామ్మ.