అట్రాసిటీ కేసులను గడువులోగా పరిష్కరించాలి : బక్కి వెంకటయ్య

అట్రాసిటీ కేసులను గడువులోగా పరిష్కరించాలి : బక్కి వెంకటయ్య
  • తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

గద్వాల, వెలుగు: అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను గడువులోగా పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆఫీసర్లను ఆదేశించారు. జోగులాంబ గద్వాల జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో కలెక్టర్ సంతోష్ , ఎస్పీ  శ్రీనివాసరావుతో కలిసి పోలీస్, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల ఆఫీసర్లు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల పురోగతి, భూ సమస్యలు ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పలువురు జోగులాంబ గద్వాల జిల్లాలో సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారికే కేటాయించాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువవికాసం స్కీంలలో ఎస్సీ, ఎస్టీ కోటా పూర్తిస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.

సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగారావు, కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి, రాంబాబు నాయక్, రేణిగుంట్ల ప్రవీణ్, ఆర్డీవో అలివేలు, రమేశ్ బాబు, డీఎస్పీ మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.