డబ్బులు పంచుతున్నడనే అనుమానంతో ..టీడీపీ నేతపై దాడి

డబ్బులు పంచుతున్నడనే అనుమానంతో ..టీడీపీ నేతపై దాడి
  • అనుచరులతో కలిసి దాడి చేసిన  బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీకాంత్
  • పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు

మాదాపూర్, వెలుగు: శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో డబ్బులు పంచుతున్నాడనే అనుమానంతో  టీడీపీ నేతపై  బీఆర్ఎస్ మియాపూర్ కార్పొరేటర్, అతడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్​లోని ఆర్బీఆర్ కాంప్లెక్స్ లో ఉంటున్న నల్లమల్ల రమేశ్ ఇన్వెంట్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్​లో పనిచేస్తున్నాడు. టీడీపీ నాయకుడైన రమేశ్.. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు. బుధవారం సాయంత్రం బాలు అనే వ్యక్తిని కలిసేందుకు మియాపూర్​లోని నదిగడ్డ తండాకు రమేశ్ వెళ్లాడు.

బాలుతో మాట్లాడి వస్తుండగా.. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అతడి అనుచరులు రమేశ్​ను అడ్డుకున్నారు. డబ్బులు పంచడానికి వచ్చాడనే అనుమానంతో దాడి చేశారు. దీంతో బాధితుడు..  కార్పొరేటర్ శ్రీకాంత్, అతడి అనుచరులపై మియాపూర్ పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. దాడి విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పీఎస్​కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. రమేశ్ ​కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుండటం, పాత కక్షలను మనుసులో పెట్టుకునే కార్పొరేటర్ శ్రీకాంత్, అతడి అనుచరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.