కారు బ్లాక్​ ఫిల్మ్​తొలగిస్తుండగా.. ట్రాఫిక్ పోలీసులపై దాడి

కారు బ్లాక్​ ఫిల్మ్​తొలగిస్తుండగా.. ట్రాఫిక్ పోలీసులపై దాడి

మెహిదీపట్నం, వెలుగు: కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగిస్తున్న ట్రాఫిక్  పోలీసులపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన సీఐపై దాడికి యత్నించాడు. ఈ ఘటన హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగర్ కాలనీకి చెందిన జి.రత్న రాజ్ కుమారుడు జాషువా(22)   సోదరుడితో కలిసి కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో మాసబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ సీఐ రామ్ ప్రసాద్ వెహికల్స్​ను తనిఖీ చేస్తున్నారు.  జాషువా ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో తొలగించమని యజమానిని ఆదేశించారు.

కానీ అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బ్లాక్ ఫిల్మ్ ను తొలగిస్తుండగా వారిపై జాషువా దాడికి పాల్పడ్డాడు. సీఐ అడ్డురావడంతో ఆయనపైనా దాడి చేయబోయాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హుమాయున్ నగర్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.