ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం... రోహిత్‌‌ ప్రాక్టీస్‌‌ షురూ

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం... రోహిత్‌‌ ప్రాక్టీస్‌‌ షురూ

ముంబై: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ప్రాక్టీస్ షురూ చేశాడు. మంగళవారం ముంబై శివారులోని ఓ ప్రాంతంలో టీమిండియా మాజీ బ్యాటింగ్‌‌ కోచ్‌‌ అభిషేక్‌‌ నాయర్‌‌తో కలిసి ట్రెయినింగ్‌‌ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్‌‌స్టాలో పోస్ట్‌‌ చేశాడు. ఐపీఎల్‌‌ తర్వాత రెండు నెలల బ్రేక్‌‌ తీసుకున్న హిట్‌‌ మ్యాన్‌‌ ఫ్యామిలీతో కలిసి ఇంగ్లండ్‌‌కు వెళ్లాడు. సెలవులు ముగించుకుని గతవారమే ఇండియాలో అడుగుపెట్టాడు. 

రోహిత్‌‌కు కొన్నిసార్లు వ్యక్తిగత కోచ్‌‌గా కూడా పని చేసిన నాయర్‌‌.. ఇటీవలే కేఎల్‌‌ రాహుల్‌‌కు కూడా శిక్షణ ఇచ్చాడు. అతని బ్యాటింగ్‌‌లో కొన్ని మార్పులు చేయడంతో ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌లో కేఎల్‌‌ 532 రన్స్‌‌ చేశాడు. బ్యాటింగ్‌‌ టచ్‌‌ను బట్టి రోహిత్‌‌ ఇప్పట్లో వన్డేలకు గుడ్‌‌ బై చెప్పే చాన్స్‌‌ లేనట్లుగానే కనిపిస్తోంది. 26 నెలల తర్వాత జరిగే 2027 వన్డే వరల్డ్‌‌ కప్‌‌ వరకు ఆడాలన్న ధృడ సంక్పలంతో కనిపిస్తున్నాడు.  

అయితే వన్డే వరల్డ్‌‌ కప్‌‌ కోసం రాబోయే రెండేళ్లు అందుబాటులో ఉండే ప్లేయర్లతో ఓ కచ్చితమైన కోర్‌‌ సెటప్‌‌ను ఏర్పాటు చేయాలని సెలెక్షన్‌‌ కమిటీ భావిస్తోంది. మరోవైపు రోహిత్‌‌కు ఆసీస్‌‌తో సిరీస్‌‌ను ఫేర్‌‌వెల్‌‌గా చేసి శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ను కెప్టెన్‌‌గా ప్రకటించాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తున్నట్లు సమాచారం. అయితే సెలెక్షన్‌‌ కమిటీ, బీసీసీఐ ఆఫీస్‌‌ బేరర్లు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తి రేపుతోంది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌‌ (49), కోహ్లీ (51) తర్వాత రోహిత్‌‌ (32) మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌‌తో జరిగిన చాంపియన్స్‌‌ ట్రోఫీ ఫైనల్లోనూ రోహిత్‌‌ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచిన సంగతి తెలిసిందే.