కరోనా పై అధికారులు ప్రజల్లో ధైర్యం కల్పించాలి

 కరోనా పై అధికారులు ప్రజల్లో ధైర్యం కల్పించాలి

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.  అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి ప్రజలను ఈ వైరస్ బారిన పడకుండా కాపాడాలన్నారు. కరోనా నివారణ చర్యలపై ఖమ్మం జిల్లాలో జిల్లా స్థాయిలో ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు పువ్వాడ. 


కరోనా నివారణ విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఫీవర్ సర్వే ద్వారా గ్రామాల్లో ఇంటింటికి కరోనాపై అవగాహన కల్పించాలని.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలన్నారు.


సీఎం కేసీఆర్ నిరంతరం కరోనాపై సమీక్ష చేస్తున్న క్రమంలో జిల్లాల్లో ఎప్పటికప్పుడు కరోనా కేసులను, పురోగతి వివరాలను సమర్పించాలన్నారు. ఆక్సిజన్, లభ్యత, మందుల కొరత, టెస్ట్ కిట్ల కొరత రాకుండా చూడాలన్నారు. కొరత ఉంటే తెలపాలని..సీఎంతో మాట్లాడి అందుకు కావాల్సిన కిట్స్, సౌకర్యాలు ఏర్పాటు చేసుకుందామని వివరించారు.
అంతేకాదు త్వరలోనే వైద్య సిబ్బంది మరింత పెరగనుందని తెలిపారు.కరోనా పై ప్రజల్లో ధైర్యం కల్పిస్తూ వారికి అండగా నిలవాలని సూచించారు.పాత బస్ స్టాండ్ లో కరోనా పరీక్షలు జరుపుతూ అన్ని వసతులు ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ను అభినందించారు మంత్రి పువ్వాడ.


కొవిడ్ పేషెంట్స్ కు ఆక్సీజన్ కొరత లేకుండా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రూ.90 లక్షలతో నిర్మించిన Oxygen Generated Plant ను ఏర్పాటు చేసుకోవాడం శుభ పరిణామం అన్నారు. ప్రతి రోజు 125 సిలిండర్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుతో ఆక్సిజన్ కష్టాలు లేవని అన్నారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణవాయువు కు ఇబ్బంది లేదన్నారు. Remdesiver ఇంజక్షన్ లు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడ బ్లాక్ మార్కెట్ లో లేకుండా పోలీస్ వ్యవస్థ బాగా పని చేస్తుందని అందుకు పోలీస్ కమిషనర్ ను అభినందించారు. కొవిడ్ నివారణ చర్యలపై ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ కేసీఆర్ పక్కా ప్రణాళికతో  అన్ని సౌకర్యాలు అందిస్తున్నారని తెలిపారు మంత్రి పువ్వాడ.