
బషీర్బాగ్, వెలుగు: గ్రేటర్ లో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావును ఆటో డ్రైవర్లు సన్మానించారు. హిమాయత్ నగర్ లోని మఖ్దూం భవన్లో రాష్ట్ర ఆటో డైవర్స్ యూనియన్లు, జేఏసీ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం మాట్లాడుతూ.. ఆటో మీటర్ చార్జీలు పెంపు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఓలా, ఊబర్, ర్యాపిడోల నుంచి రక్షణకు ప్రత్యేక యాప్ వంటివి నెరవేర్చాలా ప్రభుత్వంతో మాట్లాడాలని కూనంనేనిని కోరారు. జేఏసీ నేతలు సీహెచ్.జంగయ్య, ఎండీ.ఒమర్ ఖాన్, ఎస్కే.లతీఫ్, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.