18 లక్షల దీపాల వెలుగులో శ్రీరాముని నగరం

18 లక్షల దీపాల వెలుగులో శ్రీరాముని నగరం

దీపావళిని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో నిర్వహిస్తున్న దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు యూపీకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తొలుత రామ జన్మభూమిలోని  రాంలాలా విరాజ్ మాన్ స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మోడీకి రామజన్మభూమి ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చిన మోడీ.. రామ జన్మభూమి తీర్థ క్షేత్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన భగవాన్ శ్రీరాముని రాజ్యాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాయంత్రం సరయూ నదీ తీరంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. నదీ తీరంలో దాదాపు 18 లక్షల మట్టి ప్రమిదలను వాలంటీర్లు వెలిగించారు. బాణాసంచా, లేజర్ షో,  త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఆకట్టుకున్నాయి. హారతి కార్యక్రమం తర్వాత రామ మందిర నిర్మాణ పనులను మోడీ పరిశీలించనున్నారు. దాదాపు 4వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

2020 నుంచి..

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యోగి ప్రభుత్వం మెగా ‘దీపోత్సవ్’ వేడుకలను నిర్వహిస్తోంది. 2021లో దీపోత్సవ వేళ సరయూ నది ఒడ్డున 9 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించడంతో అయోధ్య ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 2020లో 5.84 లక్షల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 18 లక్షల దీపాలు శ్రీరాముడి నేలలో వెలుగుతున్నాయి.