పైసా లంచం లేకుండా బిల్డింగ్ పర్మిషన్లు: కేటీఆర్
మున్సిపాలిటీలతో కలెక్టర్లకు ఇదివరకు పనుండేది కాదు
నాలుగేండ్లలో మార్చేసినం
ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించాలి
కొత్త మున్సిపల్ చట్టంపై కలెక్టర్లు, అధికారులకు అవగాహన
బీపాస్లో లోటుపాట్లుంటే పరిష్కరించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఏప్రిల్ రెండో తేదీ నుంచి రాష్ట్రంలో బీపాస్ అమల్లోకి వస్తుందని, పైసా లంచం లేకుండా బిల్డింగ్ పర్మిషన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఎస్ బీపాస్, మీసేవతో పాటు త్వరలోనే కొత్తగా మరో యాప్ను తీసుకువస్తామని, వాటి ద్వారా ప్రజలకు వేగంగా సేవలందిస్తామని తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతి అంశాలపై శుక్రవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
సిరిసిల్ల జిల్లా అయితదనుకోలే..
సిరిసిల్ల ప్రాంతం జిల్లా కేంద్రం అవుతుందని ఎన్నడూ అనుకోలేదని, అక్కడ చిన్న ఆఫీసు ఏర్పాటు చేయాలన్నా యుద్ధం చేయాల్సి వచ్చేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవైనా ప్రపోజల్స్కు గ్రీన్సిగ్నల్ తెచ్చుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని, రాష్ట్ర ఆవిర్భావంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజల కోణం నుంచి ఆలోచన చేసి పాలన మొదలుపెట్టారని, అందుకే 33 జిల్లాలు ఏర్పాటు చేశారని తెలిపారు. నాలుగేళ్లలో సీఎం అడ్మినిస్ట్రేషన్లో ఎన్నో మార్పులు తెచ్చారని, మొత్తం వ్యవస్థనే మార్చేశారని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేరాలె..
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో ఇంతకుముందు కలెక్టర్లకు పెద్దగా సంబంధాలుండేవి కాదని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కేటీఆర్ చెప్పారు. మున్సిపాలిటీల నిర్వహణ, పౌర సేవల్లో కలెక్టర్లదే కీలక పాత్ర అన్నారు. తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్లో మంచి రోడ్లు, డ్రైనేజీలు, పచ్చటి వాతావరణం, పార్కులు, మంచినీళ్లు ఉండాలని ప్రజలు కోరుకుంటారని, అవేమీ గొంతెమ్మ కోర్కెలు కాదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు పనిచేయాలని సూచించారు. ఏ పనిచేసినా ప్రజలకు ఎక్కువ కాలం సేవలందించేలా ఉండాలని, టౌన్ ప్లానింగ్ విషయంలో సీరియస్గా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
బీపాస్పై అవగాహన కల్పించండి
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా టీఎస్ ఐపాస్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారని.. సింగిల్ విండో సిస్టంలో ఇండస్ట్రీస్కు పర్మిషన్లు ఇచ్చే విప్లవాత్మక విధానాన్ని విజయవంతంగా అమలు చేశామని కేటీఆర్ చెప్పారు. అదే స్ఫూర్తితో బిల్డింగ్ పర్మిషన్లను సులువుగా ఇచ్చేందుకు టీఎస్ బీపాస్ను తీసుకువస్తున్నామని, ఏప్రిల్ రెండో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. మార్చిలో బీపాస్ సాఫ్ట్వేర్, దాని అమలు, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయన్న అంశాలను పరిశీలించాలని.. ప్రజలు, అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండానే బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 75 గజాల్లోపు స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదని వివరించారు. ఏవైనా సేవలకోసం మున్సిపాలిటీ ఆఫీసుకు వచ్చే ప్రజలకు అసంతృప్తి కలగకుండా ఆఫీసర్లు, సిబ్బంది వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ బీపీ ఆచార్య, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
