కేటీఆర్ మీరు ఆగుతరా లేదా.. వరద ప్రాంతంలో బీటెక్ విద్యార్థిని కేకలు

కేటీఆర్ మీరు ఆగుతరా లేదా.. వరద ప్రాంతంలో బీటెక్ విద్యార్థిని కేకలు

సిరిసిల్లలో బుధవారం వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్‌‌ను వింత అనుభవం ఎదురైంది. తమ ఇంటి ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ సమస్య కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు స్నేహ అనే బీటెక్ స్టూడెంట్ ప్రయత్నం చేసింది. యువతి మాటలు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో "మీరు ఆగుతారా లేదా..?" అంటూ గద్దించి మరీ మంత్రి కేటీఆర్ ఆగిపోయేలా చేసింది  బిటెక్ స్టూడెంట్ స్నేహ. ఆమె పిలుపుతో ఆగిపోయిన కేటీఆర్ సమస్యను అడిగి తెలుసుకున్నారు.

లోతట్టు ప్రాంతమైన శాంతినగర్ ఏరియాలో మంత్రి కేటీఆర్ సందర్శించి వరద బాధితులను పరామర్శిస్తున్న సమయంలో బీటెక్ స్టూడెంట్ స్నేహ కలిసింది.  "ఏళ్లుగా తమ ఇంటి ముందు ట్రాన్స్ఫార్మర్ ఉందని, ఎన్ని సార్లు చెప్పినా తొలగించడం లేదని.." కేటీఆర్ కు వివరించింది.  "సర్ మా ఇంటి ముందు ట్రాన్స్ఫార్మర్ ఉంది.. వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు వస్తున్నాయి..యాడ కరెంట్ షాక్ కొడుతుందోనని భయమేస్తుంది.. ఒక్కసారి రండి..మా ఇంటికి" అంటూ ప్రాధేయపడింది.  "కరెంటు సమస్యలు తర్వాత అమ్మా.. ముందు వరద సమస్యలు తెలుసుకుంటా" అంటూ.. మంత్రి కేటీఆర్ సర్దిచెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా.. "సర్ మావి ప్రాణాలు కావా..? ఎందుకు రారు..? ఒక్కటే ఒక్కసారి రండి.. ప్లీజ్ సర్.. ఫస్ట్ మీరు ఆగండి సర్..వెళ్లకండి.. ఆగి సమాధానం చెప్పండి." అంటూ స్నేహ...మంత్రి కేటీఆర్ ను గద్దించినంత పని చేసింది.

 "మమ్మి లెటర్ ఇయ్యి, లెటర్ ఇవ్వవే" అంటూనే.. కేటీఆర్ ను ఆపేసింది స్నేహ.   "ట్రాన్స్ ఫార్మర్ తో ప్రాణభయం ఉంది సర్" అని చెప్పగా..  ఈ సమస్య పూర్తి చేయండి అని కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు మంత్రి. యువతి పేరు, చదువు గురించి మంత్రి కేటీఆర్ అడగ్గా..  "స్నేహ.. బీటెక్ " అని చెప్పింది.  "గింత సిన్నగున్నవ్.. బిటెక్ సదువుతున్నవా.. గందుకే గింత గట్టిగా మాట్లాడుతున్నవ్" అంటూ నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు మంత్రి కేటీఆర్. "గాడ్ బ్లస్ యూ అమ్మా, బాగా చదువుకో" అంటూ.. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి కేటీఆర్.