వేలానికి సిద్ధంగా బాలాపూర్ గణేష్ లడ్డూ..ఈసారి ఎవరికి దక్కుతుందో

వేలానికి సిద్ధంగా బాలాపూర్ గణేష్ లడ్డూ..ఈసారి ఎవరికి దక్కుతుందో

 

  • 32వ ఏడాది వేలానికి సిద్ధం
  • గత ఏడాది రూ.30 లక్షలకు దక్కించుకున్న శంకర్​రెడ్డి

ఎల్బీనగర్, వెలుగు:లడ్డు వేలం పాట అంటేనే గుర్తుకు వచ్చే బాలాపూర్​ గణేశ్..ఈ లడ్డు  కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే వేలంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. మొదట భక్తిగా..తర్వాత సెంటిమెంట్గా..అనంతరం  ప్రెస్టీజ్ఇష్యూగా మారిపోయింది. ఏడాదికేడాది  ఈ లడ్డు ధర పెరుగుతూ పోతుందే తప్ప తగ్గడం లేదు. 1980లో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసి  వినాయకుడిని ప్రతిష్ఠించారు.

1994లో మొదటిసారి లడ్డు వేలం పాట మొదలుపెట్టగా  రూ.450కి కొలన్ ​మోహన్​రెడ్డి దక్కించుకున్నారు. ఇప్పటివరకు 30 సార్లు వేలం నిర్వహించారు. 2020లో కరోనా కారణంగా వేలం లేకుండానే అప్పటి సీఎం కేసీఆర్ కు అందజేశారు. 2023లో 36 మంది పాల్గొనగా రూ. 27 లక్షలకు దాసరి దయానంద్​రెడ్డి చేజిక్కించుకున్నారు. గత ఏడాది నలుగురు మాత్రమే పాల్గొనగా, బాలాపూర్​కే చెందిన బీజేపీ లీడర్​ కొలన్ ​శంకర్​రెడ్డి అత్యధికంగా రూ.30 లక్షల వెయ్యికి కైవసం చేసుకున్నారు. 

రూ.1116తో మొదలయ్యే పాట మెల్లి మెల్లిగా లక్షలకు చేరుకుంటుంది.  వేలంలో పాల్గొనేందుకు బాలాపూర్​ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారూ వస్తుంటారు. ఇంతకుముందు వరకైతే  లడ్డూను గెలుచుకున్నవారు స్థానికులైతే వారు ఆ మొత్తాన్ని మరుసటి ఏడాది చెల్లించే వెసులుబాటు ఉండేది. కానీ, గత సంవత్సరం నుంచి రూల్స్​ మార్చారు.. అంతకుముందు ఏడాది వేలంలో ఎంతకు కొన్నారో అంతే మొత్తం డిపాజిట్ చేయించుకుంటున్నారు.

ఏడుగురి పేర్లు ఖరారు 

ఈ ఏడాది వేలంలో ఏడుగురు పాల్గొనబోతున్నారు. చంపాపేట్ నుంచి మర్రి రవికిరణ్​ రెడ్డి, ఎల్బీనగర్​నుంచి అర్బన్ గ్రూప్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, కర్మన్​ఘాట్​కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, కంచర్ల శివారెడ్డి, కందుకూరు కొత్తగూడానికి చెందిన సామ రామ్ రెడ్డి, పీఎస్ కె గ్రూప్​కు చెందిన మెంబర్స్, చంపాపేట్​కు చెందిన జిట్టా పద్మా సురేందర్ పోటీలో ఉన్నట్టు ప్రకటించారు.