ఆరేళ్లల్లో ఏం చేశారు?..రెండేండ్లాయె రుణమాఫీ ఏది?.

ఆరేళ్లల్లో ఏం చేశారు?..రెండేండ్లాయె రుణమాఫీ ఏది?.
  • ఆరేండ్లలో రైతులకు మీరేం చేసిండ్రు?: సంజయ్​
  • ముందు రుణమాఫీ చేసి రైతుల సమస్యలపై మాట్లాడండి
  • దమ్మూ ధైర్యం ఉంటే మార్కెట్​ కమిటీలు రద్దు చేయండి
  • ఫసల్​ బీమా రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: గడిచిన ఆరేండ్లలో రైతులకు ఏం చేశారో చెప్పిన తర్వాతే రైతుల సమస్యల గురించి మాట్లాడాలని టీఆర్​ఎస్​ లీడర్లకు బీజేపీ స్టేట్​ చీఫ్, ఎంపీ బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. పార్లమెంట్​లో ఆమోదం పొందిన బిల్లుల పట్ల రాష్ట్ర​ ప్రభుత్వం అవగాహన లేకుండా మాట్లాడటం, కాంగ్రెస్  పార్టీ ప్రేరిత బంద్​లో పాల్గొనడం టీఆర్ఎస్  రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం రైతులను రెచ్చగొట్టొద్దని ఆయన అన్నారు. రాష్ట్ర  రైతులెవ్వరూ ఈ బంద్ లో పాల్గొనవద్దని కోరారు. ఈ నెల 8న కొన్ని రైతు సంఘాలు, ముఖ్యంగా పంజాబ్ కు చెందిన రైతు సంఘాలు, కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్​కు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో బండి సంజయ్​ పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాటి నుంచి ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయాలని, ముందు రుణమాఫీ చేసిన తర్వాత రైతుల గురించి మాట్లాడాలని టీఆర్​ఎస్​ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​కు, టీఆర్ఎస్​కు  తేడా లేదనే విషయం ఈ బంద్​కు టీఆర్​ఎస్​ మద్దతు ఇవ్వటం ద్వారా అర్థమవుతోందని ఆయన అన్నారు. రైతు బంధు సర్వరోగ నివారిణి అని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. రుణమాఫీ ఆలస్యంపై రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మార్కెట్​ కమిటీలో టీఆర్​ఎస్​ తాబేదార్లను నియమించిన్రు

రాష్ట్రంలో రూ. లక్ష  లోపు వడ్డీలేని లోన్లు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో రైతులు 13 శాతం వడ్డీలు చెల్లిస్తున్నారని సంజయ్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు కావడం లేదని, ఫలితంగా  రైతులు అకాల వర్షాలు,  కరువుతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇదీ రైతుల పట్ల టీఆర్ఎస్  ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు లేవని, సూక్ష్మ సేద్యానికి నీళ్లు ఇవ్వడం లేదని, కేంద్రం ఇస్తున్న నిధులతో టీఆర్ఎస్ నాయకులకు ట్రాక్టర్లు కొనిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఫసల్ బీమా యోజన లాంటి పథకాలను అమలు చేయాలని బండి సంజయ్​ డిమాండ్ చేశారు.  ‘‘రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్​ కమిటీల్లో మీ తాబేదార్లను, మీ పార్టీ నాయకులను నియమించుకొని రైతులకు అన్యాయం చేస్తున్నరు. మీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు దళారులతో కుమ్మక్కయి  రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అవినీతికి పాల్పడుతున్నరు. దీన్ని ప్రశ్నించిన రైతులను  జైళ్లపాలు చేస్తున్నరు. ఇప్పటికైనా మీకు దమ్ము,  ధైర్యం ఉంటే మీ మార్కెట్  కమిటీలను రద్దు చేసి రైతు సంఘాలకే మార్కెట్  కమిటీల నిర్వహణను అప్పజెప్పాలి” అని టీఆర్​ఎస్​ లీడర్లపై ఆయన మండిపడ్డారు.