బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందే... సంజయ్​

బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందే... సంజయ్​
  • పార్టీ ఫిరాయింపుల్లో కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా లేదు: సంజయ్​
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
  • రేవంత్ రెడ్డి, ఒవైసీవి కుమ్మక్కు రాజకీయాలు
  • ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని స్వాగతిస్తున్నం
  • కేంద్ర మంత్రి పదవి కట్టేసినట్టు ఉందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీజేపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి చేరాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి.. ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ పేరుతో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు, అవినీతి, అక్రమాలు, హామీల మోసం విషయంలో కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా ఏమీ లేదని అన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్​కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్ ఉండదు కాబట్టే కేశవరావు చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించారన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో బండి సంజయ్ చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ లోకి 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించబోతున్నారని వార్తలొస్తున్నాయని, వారందరితో రిజైన్ చేయించి ఎన్నికలకు వెళితే.. ఆ సీట్లన్నీ బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యమని సంజయ్​అన్నారు. గతంలో హుజూరాబాద్, మునుగోడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సంజయ్ గుర్తుచేశారు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా హైకమాండ్ ఎవరిని నియమించినా కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పదవి కట్టేసినట్టు ఉందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.  

విభజన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి

విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడాన్ని స్వాగతిస్తున్నానని సంజయ్ అన్నారు.  ఆయా సమస్యల పరిష్కారానికి సీఎంలు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. “గతంలో మాదిరిగా చేపల పులుసు, రొయ్యల వేపుడు పేరుతో తెలంగాణకు అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదనుకుంటా. కొంతమంది గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నరు. అట్లాంటి వాళ్లకు ఇద్దరు సీఎంలు అవకాశం ఇవ్వకూడదని కోరుకుంటున్నా. తెలంగాణ బిడ్డగా నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. కానీ, భారత ప్రభుత్వ ప్రతినిధిగా రెండు రాష్ట్రాలను సమంగా చూడాలి. కొందరు పదవుల్లో ఉంటే అధికారం చూస్తారు. మేము అది బాధ్యతగా భావిస్తాం. సమస్యల పరిష్కారానికి బాధ్యతతో కృషి చేస్తా”  అని సంజయ్ అన్నారు. 

కాంగ్రెసోళ్లకే ఉద్యోగాలు దొరికాయి.. 

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెసోళ్లకే ఉద్యోగాలు దొరికాయని, నిరుద్యోగులకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా రాలేదని సంజయ్ అన్నారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైందని, మిగతా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తి చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో నిధుల పంపిణీ బాధ్యతను అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు అప్పగించడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే.. వాళ్ల పరిస్థితి ఎట్లుంటదో ఆలోచించాలన్నారు.  ఇకనైనా రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలకు సమానంగా నిధుల కేటాయించాలని సంజయ్ కోరారు. అలాగే, గ్రామపంచాయతీలకు పెండింగ్​బిల్లులు, ఫీజు రీయింబర్స్ బకాయిలు కూడా రిలీజ్ చేయాలన్నారు.

బీజేపీ కార్పొరేటర్లపై దాడి హేయం

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించిన బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం నేతలు దాడి చేయడం హేయమైన చర్య అని సంజయ్ ఫైర్​అయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం ఎంఐఎం నేతలకు అలవాటైందన్నారు. రైవంత్ రెడ్డితో ఒవైసీ కుమ్కక్కై దాడులకు పాల్పడుతున్నారన్నారు.

ఎంఐఎం ఒక ప్రాంతానికే పరిమితమైన పార్టీ అని, బీజేపీ తలుచుకుంటే ఎంఐఎం నేతలు బయట తిరగలేరన్నారు. మోదీ  ప్రభుత్వం వచ్చినంక గోకుల్ చాట్ పేలుళ్లు, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ లు, ఉగ్రవాదుల ఊచకోతలు, నక్సలైట్ట అర్ధరాత్రి హత్యలు లేవని, దేశం ప్రశాంతంగా ఉందని సంజయ్ తెలిపారు.