అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్: బండి సంజయ్

అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్: బండి సంజయ్

తెలంగాణ నిధులను పెట్టుబడులుగా పెట్టి లిక్కర్ దందాను కేసీఆర్ కూతురు నిర్వహిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని కటకటాల్లోకి పంపిస్తామన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా సభలకు వెళ్లలేని దద్దమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్లోని శివాజీ చౌక్లో ప్రజలతో బండి సంజయ్ సమావేశమయ్యారు.

తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం..

12 శాతం ముస్లిం ఓట్లున్న బీహార్లో ఎంఐఎం పార్టీ ఐదు సీట్లను గెలిస్తే...80 శాతం హిందూ ఓట్లు ఉన్న తెలంగాణలో బీజేపీ ఎందుకు గెలవలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మహిళలకు రక్షణ కల్పించే పార్టీ కేవలం బీజేపీయే అని చెప్పారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయాలని చూస్తే తాటతీస్తామని హెచ్చరించారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను హత్య చేస్తే కుహనావాదులు, మహిళా సంఘాలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను కాపాడుకునే బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. 

ఐకే రెడ్డి అవినీతిపరుడు..

నిర్మల్లో డి పట్టా భూములు, చెరువు కబ్జాలు చేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రూ. 100 కోట్లు జేబులో వేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 10 లక్షలు తీసుకున్న వారు.. జనవరి 10వ తేదీ వరకు బాధితులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే నిర్మల్ లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నిర్మల్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి, కలెక్టర్ కలిసి  ఒక వర్గం వారికి, తమ అనుచరులకే కేటాయించారన్నారు. నిర్మల్ లోని మినీ స్టేడియంలో ఒక్క గజం కబ్జా  చేసినా ఊరుకోమన్నారు. 

ఒక్క అవకాశం ఇవ్వండి..

నిర్మల్ నియోజకవర్గాన్ని ఒక్కసారి తమకు అప్పగించాలని బండి సంజయ్ కోరారు. అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో కాషాయ జెండాను ఎగరవేసి ఎంఐఎం ఆగడాలను అరికడతామన్నారు. పార్లమెంటులో సుష్మా స్వరాజ్ జై తెలంగాణ అని మద్దతు తెలపడం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. బీజేపీ మద్దతుతో ఏర్పడిన తెలంగాణను దోచుకు తింటున్న కేసీఆర్ మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని సూచించారు. ఆలోచించి ఓటు వేయండి..బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా కొనసాగిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.