కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ నగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 16 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 90వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్ లో ఆదివారం(ఆగస్టు09) తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ నగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ లావణ్య, సురేష్ దంపతుల ఇంట్లో ఈ చోరీ జరిగింది. బాధితులు ఇద్దరు పనిమీద వరంగల్ కు వెళ్లి తిరిగి ఇంటికొచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి చెక్ చేయగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. దొంగలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. సిసిఎస్, క్లూస్ టీం ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
