హిమంత బిశ్వశర్మపై దాడి కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం

హిమంత బిశ్వశర్మపై దాడి కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను స్టేజీపై మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు హైదరాబాద్ కు ముఖ్య అతిథిగా వచ్చిన అసోం ముఖ్యమంత్రిని గౌరవించాలనే కనీస సోయి లేకుండా టీఆర్ఎస్ నేతలు నీచంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. మెడలో గులాబీ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నేతలను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు స్టేజీపైకి ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇదేనా..? అంటూ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కు కేంద్రం భద్రత కల్పించకపోతే ఆయన స్వేచ్ఛగా వెళ్లగలుగుతారా..? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా..? అని వ్యాఖ్యానించారు. లక్షలాది మంది పాల్గొనే శోభాయాత్రకు హాజరయ్యేందుకు అసోం నుండి వచ్చిన ముఖ్య అతిథిని అడ్డుకుంటే పరువు పోతుందనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గు చేటన్నారు. 

భారతదేశంలోనే అతి తక్కువ కాలంలో అద్భుతమైన పాలనతో అసోం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న గొప్ప వ్యక్తి హిమంత బిశ్వశర్మ అని బండి సంజయ్ అన్నారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ.. ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్న అసోం ముఖ్యమంత్రిని చూసి టీఆర్ఎస్ వాళ్లు నేర్చుకోవాలన్నారు. టీఆర్ఎస్ నాయకులను పంపించి అసోం ముఖ్యమంత్రిపై దాడి చేయించే కుట్రచేయడం సీఎం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. హిమంత బిశ్వశర్మపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టి, ఈ దాడికి పురిగొల్పిన మంత్రులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులను గౌరవించాలనే కనీస సోయిలేని కేసీఆర్.. జాతీయ పార్టీ పెడుతానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులెవరూ పాల్గొనలేదన్నారు. 

ఖమ్మంలో బీజేపీ సీనియర్ నేత, కమ్మ మహాజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎర్నేని రామారావుపై టీఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ చెప్పారు. ఎర్నేని రామారావుతో పాటు ఆయన కుటుంబానికి బీజేపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  ఎర్నేని రామారావుపై దాడిని చేసిన వారిని అరెస్ట్ చేసి, దాడికి పురిగొల్పిన నాయకులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.