హైదరాబాద్ సిటీలో ఎండలు ముదురుతుండటంతో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రోజుకు ఈ క్రమంలో అప్రమత్తమైన హైదరాబాద్ వాటర్ బోర్డు నగరవాసులకు నీటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.
హైదరాబాద్ లో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో రోజుకు 8 వేలకు పైగా ట్యాంకర్లను డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ డిమాండ్ 13 వేలకు చేరినా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నీటిని సరఫరా చేసేలా యంత్రాంగాన్ని సిద్ధం చేశామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం నగరం అంతటా ఉన్న 84 ఫిల్లింగ్ స్టేషన్ల ద్వారా 1200 వాటర్ ట్యాంకర్లు నిరంతరం సేవలందిస్తున్నాయని చెప్పారు.ముఖ్యంగా ఐటీ కారిడార్ ,శివారు ప్రాంతాలైన కొండాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్, గచ్చిబౌలితో పాటు బంజారాహిల్స్, కూకట్పల్లి, ప్రగతి నగర్ ఏరియాల్లో ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఉందని అధికారులు చెప్పారు.
ఇదే సమయంలో అక్రమార్కులకు ఎండీ అశోక్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డొమెస్టిక్ (గృహ అవసరాల) కోసం బుక్ చేసిన ట్యాంకర్లను, కమర్షియల్ అవసరాలకు మళ్లిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండాట్యాంకర్లను బ్లాక్ లిస్ట్లో పెడతామని హెచ్చరించారు.
సింగూరు ప్రాజెక్టు మినహా నగరానికి నీటిని అందించే మిగతా అన్ని ప్రాజెక్టుల్లో సరిపడా నీరు ఉందని ఆయన తెలిపారు. సింగూరులో రిపేర్లు జరుగుతున్న కారణంగా.. జూన్ 1వ తేదీ వరకు అవసరమైన నీటిని స్టోర్ చేసి వాడుతున్నామని తెలిపారు. నగరాన్ని నీటి ఎద్దడి నుంచి గట్టెక్కించేందుకు జలమండలి అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
