సంజయ్.. కవిత ట్వీట్ల వార్​

సంజయ్.. కవిత ట్వీట్ల వార్​
  •     గవర్నర్​కు గౌరవం దక్కదు.. ఆడబిడ్డలకు అండ లేదు:బండి సంజయ్
  •     మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం అంటూ ట్వీట్
  •     ఆడబిడ్డ తలుచుకుంది.. మీ అడ్రస్ గల్లంతంటూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ 

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మంగళవారం ట్విట్టర్ వార్​నడిచింది. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్​ నేతలు కనీస గౌరవం ఇవ్వడం లేదని సంజయ్​ ట్వీట్ చేయగా కవిత కౌంటర్​ ట్వీట్ చేశారు. “గవర్నర్ కు గౌరవం దక్కదు, ఆడబిడ్డలకు లేదు అండ, గిరిజన మహిళలపై పోలీస్ గిరి, బతుకమ్మను అవమానించిన వాడితో ఆలింగనం, ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతావు అడ్డం, అదిరింది కేసీఆర్.. నీ మహిళా సంక్షేమం” అని సంజయ్ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా  ‘‘పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదు, మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్నా.. తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు, నినాదాలకే పరిమితమైన భేటి బచావో.. బేటి పడావో.. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కన్నీరు తెప్పిస్తున్న దుస్థితి.. మహిళా విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం.. ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధి ముఖ్యం.. ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది” అని కవిత ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ కి బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చారు. “సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం, ఆడబిడ్డలను వేధించి పీడించి.. ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం, పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్లేసిన వైనం, పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకూ ఎవరికీ లేని రక్షణ, తొలి కేబినెట్లో కనీసం ఒక్క మహిళలకూ దక్కని ప్రాతినిధ్యం, పాయఖానాలు సైతం లేక ఆడకూతుర్లు అవస్థలు పడుతుంటే స్పందించని నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో దగా చేసి మహిళల్ని గోస పెడుతూ అలసత్వం, బాలింతలు మృతి చెందినా పరామర్శించని కర్కశత్వం, రాజకీయాల కోసం మహిళా బిల్లంటూ వీధులకు ఎక్కి నాటకాలు చేస్తున్న తీరుని తెలంగాణ మహిళలోకం ఏనాడో పసిగట్టింది.. గులాబీ పార్టీ పని పడుతుంది” అని ట్వీట్ చేశారు.