ఢాకా: సాధారణ ఎన్నికలు(ఈ నెల 12న) సమీపిస్తున్న వేళ బంగ్లాదేశ్లోని ఢాకాలో ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం నిరసనకు దిగారు. తొమ్మిదవ జాతీయ వేతన స్కేల్ అమలుచేసి వెంటనే జీతాలు పెంచాలని వేలాది మంది రోడ్డెక్కారు. మహమ్మద్ యూనస్ అధికారిక నివాసం జమునాను ముట్టడించేందుకు ఉద్యోగులు ప్రయత్నించగా.. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
దీంతో 15 మంది ఉద్యోగులు గాయపడ్డారు. కాగా, వేతన స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు శుక్రవారం ఉదయం కేంద్రీయ శహీద్ మినార్ వద్ద సమావేశమయ్యారు. అక్కడి నుంచి యూనస్ అధికారిక నివాసం జమునాకు కాలినడకన బయలుదేరారు. షాహ్బాగ్ చుట్టూ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తోసుకుంటూ నిరసనకారులు ముందుకు సాగారు.
