హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా బీసీ మహిళా పోరు దీక్ష చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు మణిమంజరి ప్రకటించారు. బుధవారం వందలాదిమంది మహిళలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి తరలి వెళ్లారు.
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రం మహిళా బిల్లు పేరుతో అగ్రకులాలకు రాజ్యాధికారం కట్టబెట్టాలని కుట్ర చేస్తోందని, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను ఉపకోటా అమలు చేసినట్లే చట్టసభల్లోనూ బీసీలకు కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదని ఇదే సమయంలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు సబ్ కోటా కల్పించాలన్నారు.

