న్యూఢిల్లీ: రిటైర్డ్ అయిన తర్వాతే విదేశీ టీ20 లీగ్ల్లో ఆడాలన్న రూల్ను బీసీసీఐ మరోసారి రివ్యూ చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20 లీగ్ల నేపథ్యంలో ఇండియా కుర్ర క్రికెటర్లను కాపాడుకోవాలని భావిస్తోంది. దీంతో వచ్చే నెల 7న జరిగే బోర్డు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దీనిపై చర్చించనుంది. ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం ఇండియా ప్లేయర్లు డొమెస్టిక్, ఇంటర్నేషనల్, ఐపీఎల్కు గుడ్బై చెప్పిన తర్వాతే వేరే లీగ్ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుంది.
అయితే యంగ్స్టర్స్కు ఇక్కడ అవకాశాలు తక్కువగా వస్తుండటంతో డొమెస్టిక్ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెంటనే విదేశీ లీగ్ల్లో చేరే చాన్స్ ఉంది. ఇదే జరిగితే ఇండియా డొమెస్టిక్ క్రికెట్కు భారీ ఎత్తున నష్టం వాటిల్లనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని యంగ్ క్రికెటర్లకు అనుకూలంగా ఈ రూల్ను సడలించే అవకాశం కనిపిస్తున్నది.