తల్లిని గెంటేసిన కొడుకులకు తగిన శాస్తి..ఇంటిని సీజ్ చేసి, బాధితురాలికి అప్పగించిన రెవెన్యూ అధికారులు

తల్లిని గెంటేసిన కొడుకులకు తగిన శాస్తి..ఇంటిని సీజ్ చేసి, బాధితురాలికి అప్పగించిన రెవెన్యూ అధికారులు

మలక్ పేట, వెలుగు: కన్నతల్లిని బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేసిన ఇద్దరు కొడుకులకు రెవెన్యూ అధికారులు తగిన బుద్ధి చెప్పారు. సదరు ఇంటిని సీజ్​ చేసి బాధితురాలికి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. ముసారాంబాగ్​కు చెందిన శకుంతల బాయ్(90) కు ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు. అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. 

భర్త చాలా ఏండ్ల కింద మృతి చెందగా, తన నివాసంలో కొడుకులతో కలిసి ఉంటోంది. బాగోగులు చూడాల్సిన కొడుకులు కొద్దికాలం తర్వాత ఆమెను బలవంతంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో దిక్కుతోచని వృద్ధురాలు సైదాబాద్​లోని తన చిన్న కుమార్తె వద్ద ఉంటోంది. అయితే, తనను పట్టించుకోని కొడుకులు తన ఇంట్లో ఉండొద్దని 2024 ఫిబ్రవరిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్‌‌‌‌తో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్డీఓను ఆశ్రయించింది. 

దీంతో ఇద్దరు కొడుకులు రాజేందర్ అమిన్హా, రాజేశ్ అమిన్హాను ఆర్డీఓ పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఇంటిని తమ తల్లికి అప్పగిస్తామని అంగీకరించారు. నెలలు గడుస్తున్నా ఇంటిని ఖాళీ చేయకపోవడంతో సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ ఇటీవల రెండో నోటీసు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మూడు రోజుల కింద ఫైనల్ నోటీసు ఇచ్చారు. గడువు ముగియడంతో కొడుకులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోగా, తహసీల్దార్ జయశ్రీ గురువారం తన సిబ్బందితో కలిసి ఇంటిని సీజ్ చేసి, శకుంతల బాయ్‌‌‌‌కు  అప్పగించారు.