డబుల్ బెడ్ రూం ఇండ్లలో లబ్ధిదారుల అవస్థలు

డబుల్ బెడ్ రూం ఇండ్లలో లబ్ధిదారుల అవస్థలు

మహబూబ్​నగర్​, వెలుగు : జిల్లాలో డబుల్​బెడ్ ​రూం ఇండ్లలో సౌలత్​లు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండానే గృహ ప్రవేశాలు చేయించడంతో రోజూ కష్టాలు పడుతున్నారు. టాయిలెట్స్​ఉన్నా..  ​డ్రైనేజీ పైపులు వేసి వదిలేయడంతో వాడుకోలేని పరిస్థితి ఉంది. తాగునీరు కూడా పదిరోజులకోసారి సరఫరా అవుతుండడంతో ఉండలేక తిరిగి పాత ఇండ్లలోకి వెళ్లిపోతున్నారు. ఈ సమస్యలపై ఇటీవల జరిగిన జడ్పీ మీటింగ్​లో సభ్యులు కలెక్టర్​ దృష్టికి కూడా తీసుకెళ్లారు. 

దేవరకద్ర నియోజకవర్గంలోని ముచ్చింతలలో 40  డబుల్​బెడ్​రూం ఇండ్లకు గాను 20 ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. నిజాలాపూర్​లో 104, కురుమూర్తిలో 140 , సిద్ధాయిపల్లిలో 288 ఇండ్లకు గాను 42 మంది లబ్ధిదారులకు ఇండ్లు పంచారు. సిద్ధాయిపల్లిలో  మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​ ఓపెన్​ చేసి, లబ్ధిదారులతో స్వయంగా గృహ ప్రవేశం చేయించారు. అయితే, సిద్ధాయిపల్లిలో ఉన్న  ఇండ్లతో పాటు నిజాలాపూర్​, కురుమూర్తి, ముచ్చింతలలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఇండ్లు కట్టుడు పూర్తి చే శారు కానీ.. తాగునీరు, అండర్​ డ్రైనేజీ , కరెంట్​ సప్లై లాంటి పనులను ఎక్కడికక్కడే పెండింగ్​లో పె ట్టారు. ఈ 4 ప్రాంతాల్లో తాగునీటికి ప్రజలు గోస ప డుతున్నారు. గ్రామాలకు దూరంగా ఈ కాలనీలు  ఉండడంతో మినరల్​ వాటర్ ప్లాంట్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. చాలా ఇళ్లకు ‘భగీరథ’ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తాగునీరు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో కాలనీ మొత్తానికి ఒకే బోరు ఉండడంతో ఆ నీటినే అన్ని అవసరాలకు వాడుకుంటున్నారు. సిద్ధాయిపల్లి వద్ద ఉన్న ఇళ్లను 42 మందికి పంచగా  ఆ కాలనీలో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉంటున్నారు.

ఏడాదిగా పనులు చేయట్లే..

సిద్ధాయిపల్లిలో ఆరు నెలల కింద, ముచ్చింతల, కురుమూర్తి, నిజాలాపూర్ లో ‘డబుల్’ ఇళ్లను ప్రారంభించి ఏడాది అవుతోంది. కానీ, ఇంత వరకు అండర్​ డ్రైనేజీ పనులు పూర్తి చేయలేదు. కిచెన్​, బాత్​రూమ్స్, టాయ్​లెట్స్​లలో పైపులైన్లు, నల్లాలు ఫిట్​ చేసినా, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయ లేదు. ప్రస్తుతం అన్ని చోట్ల మురుగు నీరు మొత్తం బయటకే వస్తోంది. నిజాలాపూర్ డబుల్​ఇండ్ల వద్ద అండర్​ డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో మురుగునీరంతా పక్కనే ఉన్న పంట పొలాల నుంచి దగ్గరలోని కుంటలోకి చేరుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా కంపు వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. 

కరెంటు కనెక్షన్లు కూడా ఇయ్యట్లే..

ఇండ్లలో కరెంటు కనెక్షన్లు కూడా ఇయ్యలేదు. కొన్ని ఇళ్లల్లో స్విచ్​బోర్డులు, వైరింగ్​ పనులు కూడా చేయలేదు. ఆదరాబాదరాగా కొన్ని ఇండ్లకు మాత్రమే స్విచ్​ బోర్డులు, వైరింగ్​ ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది లబ్ధిదారులు సొంతంగా హౌస్​ వైరింగ్​ చేయించుకున్నారు.  

పనులు శాంక్షన్​ అయినవి

‘కురుమూర్తి’, నిజాలాపూర్​ ప్రాంతాల్లోని ‘డబుల్’ ఇండ్ల కాలనీలకు  శానిటేషన్​పనులు శాంక్షన్​ అయ్యాయి. వాటికి టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరలో పనులు  ప్రారంభిస్తాం. సిద్ధాయిపల్లి వద్ద ఎలక్ర్టికల్​ లైన్​ పూర్తయింది.  ఇండ్లలోకి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.   వాటర్​ సప్లై పనులు కూడా ఆర్​డబ్ల్యూఎస్​ ఆఫీసర్లు త్వరలో పూర్తి చేస్తారు.
- రామకృష్ణ, డీఈ, పంచాయతీ రాజ్​

డ్రైనేజీ లేక కంపు వాసన
మాకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ డ్రైనేజీ  లేదు.  ఇండ్లలో నుంచి వచ్చే మురుగు నీళ్లు మొత్తం బయటకు వస్తున్నాయి. ఈ నీళ్లు పక్కనే ఉన్న పొలాల మీదుగా కుంటలోకి చేరుతున్నాయి.  ఈ ప్రాంతమంతా కంపు వాసన వస్తోంది. దోమలు కూడా పెరుగుతున్నాయి. 
- ప్రకాశ్​, నిజాలాపూర్​

పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నం

మాకు రెండేళ్ల కిందట డబుల్​ బెడ్​ రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. కానీ, మాకు తాగునీళ్లు వస్తలేవు. ఉప్పు నీళ్లే వస్తున్నయ్. అవి కూడా పది రోజులుగా వస్తలేవు. పక్కనే ఉన్న పొలాల పొంటి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ నీళ్లనే తాగుతున్నాం.
- సునీత, నిజాలాపూర్