గుండెపోటుతో బెంగాల్ మంత్రి మృతి

గుండెపోటుతో బెంగాల్ మంత్రి మృతి

వెస్ట్ బెంగాల్‎కు చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుబ్రతా ముఖర్జీ (75) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యం బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే మమతా బెనర్జీ ఆస్పత్రికి చేరుకొని నివాళులు అర్పించారు. సుబ్రతా ముఖర్జీ మరణం పట్ల దీదీ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుబ్రతా లేరన్న వార్తను తాను ఇంకా నమ్మలేకపోతున్నానని ఆమె అవేదన వ్యక్తం చేశారు. సుబ్రతా ముఖర్జీ ఎంతో నిబద్ధత కలిగిన నేత అని దీదీ కొనియాడారు. సుబ్రతా ముఖర్జీ మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో నష్టమని, ఆయనలేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. 

సుబ్రతా ముఖర్జీ శ్వాస సంబంధ ఇబ్బందులతో  అక్టోబరు 24న ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు నవంబరు 1న ఏంజియోప్లాస్టీ చేసి.. స్టెంట్స్ కూడా వేశారు. అయితే ఆయనకు హైబీపీ మరియు వయసు కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తి గురువారం రాత్రి 9.22 నిమిషాలకు కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారని బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ తెలిపారు.

సుబ్రతా ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖతో పాటు మరో మూడు శాఖలను కూడా పర్యవేక్షిస్తున్నారు. సుబ్రతా పార్ధీవదేహాన్ని ప్రజల సందర్శనార్ధం కోల్‌కతాలోని రబీంద్ర సదన్‌కు శుక్రవారం ఉదయం తరలించనున్నారు. అనంతరం బల్లీగంజేలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

ఇందిరా గాంధీ రెండోసారి ప్రధాని అయినప్పుడు 1970లో కాంగ్రెస్‎లో చేరి సుబ్రతా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1999లో తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ మరుసటి ఏడాది 2000 నుంచి 2005 వరకు కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌గా కూడా పని చేశారు. సుబ్రతా ముఖర్జీ మరో ఇద్దరు నేతలతో కలిపి బెంగాల్ కాంగ్రెస్‌లో త్రిమూర్తులుగా గుర్తింపు పొందారు.  సౌమిన్ మిత్రా, ప్రియరంజన్ దాస్ మున్షీలు బెంగాల్ రాజకీయంలో కీలకం. వారితో కలిపి సుబ్రతాను బెంగాల్ త్రిమూర్తులు అంటారు. సుబ్రతా ముఖర్జీ నారద ముడుపుల కేసులో అరెస్ట్ చేయబడి విడుదలయ్యారు.