బెంగళూరులోని రాజ్భవన్ రోడ్లో ఉన్న ఫోర్-స్టార్ హోటల్లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది, హైకోర్టు లాయర్ షీలా దీపక్ ఆ హోటల్ కు 2024 జనవరి 05 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లంచ్ కు వెళ్లారు. అక్కడ పనీర్ గ్రేవీ డిష్ ఆర్డర్ చేశారు. తింటూ ఉండగా అందులో బొద్దింక కనిపించింది. దీనిపై హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది.
అంతేకాకుండా హోటల్ లోని వంటగదిని ఆమె వీడియో తీయడానికి ప్రయత్నం చేయగా సిబ్బంది తనపై దాడికి ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనను అనరాని మాటలతో దుర్భాషలాడారని లాయర్ షీలా దీపక్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై షీలా దీపక్ పోలీసులకు, బీబీఎంపీ ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 352, 341, 504, 506 కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.