
న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం బాంబులు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలతో పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భారత ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. శుక్రవారం (జూన్ 13) మోడీకి ఫోన్ చేసిన నెతన్యాహు ఇరాన్తో దాడి పరిస్థితులను వివరించారు.
ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేసిన విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోడీ వెల్లడించారు. ‘‘ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇరాన్తో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన నాకు వివరించారు. భారతదేశ ఆందోళనలను నేను ఆయనతో పంచుకున్నా. ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాను’’ అని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.
ALSO READ | మొత్తం నాశనం కాకముందే ఒప్పందం చేసుకోండి: ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు, క్షిపణి వ్యవస్థలు, సైనిక కమాండ్ కీలకమైన భాగాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం (జూన్ 13) ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఆర్మీ జనరల్ అమీర్ అలీ హజీజాదే, మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరి, మేజర్ జనరల్ హోస్సేన్ సలామి, మేజర్ జనరల్ ఘోలం అలీ రషీద్లతో సహా అనేక మంది సీనియర్ సైనిక కమాండర్లు మరణించారు. ఇరాన్ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్ అబ్బాసి, మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చి, అబ్దుల్హమిద్ మినౌచెహర్, అహ్మద్రెజా జోల్ఫాఘారి, సెయ్యద్ అమీర్హోస్సేన్ ఫఖీ, మోట్లాబిజాదేహ్ వంటి ప్రముఖ అణు శాస్త్రవేత్తలు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.