
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు సంబంధించి తనకు ముందస్తు సమాచారం ఉందని తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ హుస్సేన్ సలామీతో సహా అనేక మంది మరణించారని చెప్పారు. ఇకనైనా ఇరాన్ తిరిగి అణు ఒప్పందంపై చర్చలకు వస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అమెరికా పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు.
‘‘ఇప్పటికే ఇరాన్లో చాలా మరణాలు, విధ్వంసం జరిగింది. కానీ ఈ మారణహోమాన్ని అంతం చేయడానికి ఇంకా సమయం ఉంది. ఇరాన్ ఇప్పటికైనా అణు ఒప్పందం చేసుకోవాలి. లేదంటే ఆ తర్వాత జరిగే దాడులు అత్యంత భయంకరంగా ఉంటాయి. ఇరాన్లో ఒక మిగిలదు. ఒకప్పుడు ఇరాన్ సామ్రాజ్యంగా పిలువబడే దానిని కాపాడుకోవాలి’’ అని ట్రంప్ హెచ్చరించారు.
ఇప్పటికే ఒప్పందం చేసుకోవాలని ఇరాన్కు ఒక చాన్స్ ఇచ్చామని.. కానీ వారు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాలను అమెరికా తయారు చేస్తుందని, వాటిలో చాలా ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద కూడా ఉన్నాయని తెలిపారు. గతంలో కొంతమంది ఇరానియన్ తీవ్రవాదులు రెచ్చిపోయి మాట్లాడారు. కానీ చివరకు ఏమి జరగబోతోందో వారికి తెలియదు. వాళ్లందరూ ఇప్పుడు చనిపోయారని అన్నారు.
ఇరాన్ తీసుకునే ఏ చర్యనైనా అమెరికా నిశితంగా గమనిస్తోందని తెలిపారు. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉందని నొక్కిచెప్పారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడులను ‘అద్భుతం’ అని ట్రంప్ అభివర్ణించారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు.
కాగా, శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ చేపట్టి ఇరాన్లోని అణు కేంద్రాలు, సైనిక కమాండ్ కేంద్రాలతో సహా దాదాపు 100 లక్ష్యాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక, శాస్త్రవేత్తలకు చెందిన అనేక మంది అగ్ర నాయకులు కూడా మరణించారు. ఆరుగురు ప్రముఖ న్యూక్లియర్ సెంటిస్టులు మృతి చెందారు.