ఛతర్‌పూర్ శివాలయంలో అరుదైన అద్భుతం ! శివలింగంని చుట్టుకొని గుడిలో ప్రత్యక్షమైన నాగుపాము..

ఛతర్‌పూర్ శివాలయంలో అరుదైన అద్భుతం ! శివలింగంని చుట్టుకొని గుడిలో ప్రత్యక్షమైన నాగుపాము..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ లో ఉన్న ఒక పురాతన శివాలయంలో స్థానికులకు, భక్తులకు ఒక అరుదైన ఘటన  ఎదురైంది. మంగళవారం (21 జులై) ఉదయం నిత్యం పూజలు జరిగే  గంగా సాగర్ స్కూల్ సమీపంలోని శివాలయానికి వెళ్లిన భక్తులకు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపిచింది. సాక్షాత్తు పరమశివుడి మెడలో ఉండే నాగేంద్రుడే దిగివచ్చాడా అన్నట్లు.. ఒక పాము ఆలయంలోని శివలింగంని చుట్టుకుని కనిపించింది. 

ఉదయం పూజకు వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత శివునికి, పాముకు ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని గుర్తుచేసుకుంటూ భక్తితో పూజలు చేసి మొక్కుకున్నారు.

అలాగే భక్తులు ఏమాత్రం తొందరపడకుండా ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ.. భద్రతా కారణాల దృష్ట్యా గర్భగుడిలోకి ఎవరూ వెళ్లకుండా ఇతరులను కూడా అప్రమత్తం చేశారు.

 నాగుపామును బెదిరించడం గానీ, వెళ్లగొట్టే ప్రయత్నం గానీ ఎవరూ చేయలేదు. సురక్షిత దూరంలో నిలబడే బయటి నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

 

ఉత్కంఠగా రెండు గంటలు
దాదాపు రెండు గంటల పాటు ఆ నాగుపాము శివలింగం చుట్టూకునే  ఉండిపోయింది. ఈ విషయం కాస్త చుట్టుపక్కల వ్యాపించడంతో ఆలయం బయట పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. కొందరు ఈ అరుదైన దృశ్యాన్ని  మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా ఇంకా వైరల్‌గా మారింది.

చివరికి వెళ్లిపోయిన పాము
రెండు గంటల తరువాత.. ఆ నాగుపాము ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా దానంతట అదే గుడిలోంచి బయటకు వెళ్లిపోయింది. పాము సురక్షితంగా వెళ్లిపోయాక, భక్తులు ఆలయం లోపలికి వెళ్లి శివునికి  పాలభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎవరికీ ఏ ప్రమాదం జరగకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మానవ భక్తికి, ప్రకృతికి నడుమ జరిగిన ఒక అద్భుతమైన అనుభూతిగా భక్తులు దీనిని చెప్పుకుంటున్నారు.